మహబూబ్నగర్ జిల్లా విద్యా ముఖచిత్రాన్ని మార్చే దిశగా ఒక కీలక అడుగు పడింది. జడ్చర్ల మండలంలోని చిట్టెబోయినపల్లి గ్రామ శివారులో ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఐటీ క్యాంపస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. సుమారు 600 కోట్ల రూపాయల భారీ అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ క్యాంపస్.. ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకురానుంది.
రాష్ట్రంలో రెండో ట్రిపుల్ ఐటీ..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్మిస్తున్న అతిపెద్ద విద్యా సంస్థలలో ఇది ఒకటి. నిర్మల్ జిల్లాలోని బాసర తర్వాత రాష్ట్రంలో ఏర్పాటవుతున్న రెండో ట్రిపుల్ ఐటీ ఇదే కావడం విశేషం. వెనుకబడిన పాలమూరు జిల్లాలో ఈ సంస్థను ఏర్పాటు చేయడం వల్ల స్థానిక విద్యార్థులు ఉన్నత విద్య కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఇంజనీరింగ్ , సాంకేతిక రంగాలలో నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందనుంది.
జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయితో పాటు స్థానిక ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ముఖ్యమంత్రి భూమి పూజ నిర్వహించి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పైలాన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని వారి సందేహాలను తీర్చారు. విద్యార్థులు కష్టపడి చదివి రాష్ట్రాన్ని టెక్నాలజీ రంగంలో ముందుంచాలని ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా విద్యా ప్రమాణాలను పెంచడం, ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయడం తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనరసింహ, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యేలు ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, మెగా రెడ్డి మరియు ఇతర ప్రజా ప్రతినిధులు ఈ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో భాగస్వాములయ్యారు. ఈ క్యాంపస్ నిర్మాణం నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేసి.. త్వరలోనే తరగతులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa