హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా వెల్లడించిన నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ రోజు నుంచి ఈ నెల 21వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆకాశం మేఘావృతమై ఉండి, అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే ఆస్కారం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అకాల వర్షాల నేపథ్యంలో ముఖ్యంగా రైతులు తమ పంట కోతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత కూడా హెచ్చుతగ్గులకు లోనవుతోంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు కాస్త పెరిగి చలి తగ్గుముఖం పట్టినట్లు అనిపించినప్పటికీ, ఒక్కసారిగా మళ్లీ చలి గాలులు మొదలయ్యాయి. ఈ రోజు ఉదయం నుంచే కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలితో వణికిపోతున్నారు. పగటిపూట ఎండ ఉన్నప్పటికీ, సాయంత్రం వేళల్లో మళ్లీ చలి ప్రభావం అధికంగా ఉంటోంది. రానున్న రెండు మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది.
ప్రస్తుత చలి మరియు వర్ష సూచనల మధ్యే రాబోయే వేసవి కాలంపై వాతావరణ నిపుణులు కీలక అంచనాలు వేశారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచే భానుడి ప్రతాపం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయని వారు పేర్కొన్నారు. ఫిబ్రవరి నెల ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, ఫలితంగా ఎండల తీవ్రత ముందుగానే పెరగవచ్చని విశ్లేషిస్తున్నారు. అంటే ఈ ఏడాది ఫిబ్రవరి లోనే వేసవి తాపం ప్రజలకు చుక్కలు చూపించేలా కనిపిస్తోంది.
మొత్తానికి తెలంగాణ ప్రజలు ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అటు వర్ష సూచనలు, ఇటు మళ్ళీ మొదలైన చలి తీవ్రత, మరోవైపు ముంచుకొస్తున్న వేసవి ఎండలతో వాతావరణం గందరగోళంగా మారింది. ఈ మార్పుల వల్ల జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున చిన్నపిల్లలు మరియు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa