తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలు తుగ్లక్ పాలనను తలపిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల సికింద్రాబాద్ అస్తిత్వం ప్రమాదంలో పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సికింద్రాబాద్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (SEC) పరిధిలోని నార్త్ జోన్ ప్రాంతాలను మల్కాజిగిరిలో కలపడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని, ఇది స్థానిక ప్రజలకు తీరని అన్యాయం చేయడమేనని ఆయన మండిపడ్డారు.
సికింద్రాబాద్ హక్కుల కోసం పోరాడుతున్న తమ నాయకులను ప్రభుత్వం అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని కేటీఆర్ మండిపడ్డారు. ఎస్ఈసీ కార్పొరేషన్ సాధన కోసం శాంతియుతంగా ర్యాలీ నిర్వహించాలని భావిస్తే, పోలీసులను అడ్డుపెట్టుకుని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ నిర్బంధాలకు తాము భయపడేది లేదని, న్యాయస్థానం ద్వారా అనుమతి పొంది తీరతామని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసనను వ్యక్తం చేసి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
హైదరాబాద్లోని కీలక ప్రాంతాల భౌగోళిక రూపురేఖలను మార్చడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. నార్త్ జోన్ ప్రాంతాలను మల్కాజిగిరిలో విలీనం చేయడం వల్ల పరిపాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని, ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని వారు వాదిస్తున్నారు. ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంపై స్థానికంగా కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోందని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు.
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత విధానాలను ఎండగడతామని, ప్రజా క్షేత్రంలోనే వారికి తగిన బుద్ధి చెబుతామని కేటీఆర్ హెచ్చరించారు. అభివృద్ధి పేరుతో వినాశకర నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని, సికింద్రాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడతామని ఆయన పేర్కొన్నారు. తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ప్రజల మద్దతుతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ పునరుద్ఘాటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa