పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ న్యాయవాదిపై నమోదైన కేసును సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ఇద్దరి మధ్య ఉన్నది సమ్మతంతో కూడిన సంబంధమేనని, అది బెడిసికొట్టినంత మాత్రాన రేప్ కేసు పెట్టడం సరికాదని స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలు రేప్ వంటి తీవ్రమైన నేరం ప్రాముఖ్యతను తగ్గించడమే కాకుండా, నిందితుడిపై చెరగని మచ్చను మిగులుస్తాయని కీలక వ్యాఖ్యలు చేసింది.జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. కేవలం శారీరక సంబంధం కోసమే, పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకుండా మోసపూరితంగా హామీ ఇస్తేనే అది రేప్ కిందకు వస్తుందని కోర్టు వివరించింది. అయితే, బలమైన ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణల ఆధారంగా దీనిని నిర్ధారించలేమని తెలిపింది. ప్రతి విఫలమైన సంబంధాన్ని రేప్ కేసుగా మార్చడం, క్రిమినల్ చట్టాలను దుర్వినియోగం చేయడమేనని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.ఈ కేసులో, బాధితురాలు, నిందితుడైన న్యాయవాది 2022 నుంచి 2024 వరకు సంబంధంలో ఉన్నారు. వారి మధ్య పలుమార్లు శారీరక సంబంధం జరిగింది. గతంలో జరిగిన వివాహ వివాదం కారణంగా, నిందితుడు పెళ్లి ప్రతిపాదన తీసుకువచ్చినప్పుడు మహిళే వ్యతిరేకించినట్లు కోర్టు గుర్తించింది. అలాంటిది, సంబంధం చెడిపోయాక పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపించడం నిలబడదని పేర్కొంది.ఈ కేసును కొట్టివేయడానికి నిరాకరించిన బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కనబెట్టింది. దీర్ఘకాలం పాటు కొనసాగిన భావోద్వేగ సంబంధంలో జరిగిన శారీరక కలయికను, సంబంధం విఫలమైన తర్వాత రేప్గా చిత్రీకరించలేమని తేల్చిచెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa