తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల స్థితిగతులను మెరుగుపరిచేందుకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ పటిష్టమైన చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్య, ఉచిత పుస్తకాలు అందుబాటులో ఉండటంతో ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. అయితే.. చాలా ప్రాంతాల్లో కళాశాల భవనాలు శిథిలావస్థకు చేరడం.. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ఇతర మౌలిక వసతులు లేకపోవడం వంటి సమస్యలు తీవ్ర ఇబ్బందులను సృష్టిస్తున్నాయి. ఈ సవాళ్లను అధిగమించేందుకు ఇంటర్మీడియట్ అధికారులు సమగ్ర ప్రతిపాదనలను సిద్ధం చేశారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల రూపురేఖలు మార్చడానికి.. ముఖ్యంగా మైనారిటీ విద్యార్థులు అధికంగా ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా.. పది ప్రభుత్వ కళాశాలలను ఎంపిక చేసి.. వాటిని ఆధునికీకరించాలని నిర్ణయించారు. ఈ పనులను ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం (పీఎంజేవీకే) కింద కేంద్ర ప్రభుత్వ సహాయంతో చేపట్టనున్నారు.
ఇంటర్మీడియెట్ విద్యా డైరెక్టరేట్ ఈ ప్రతిపాదనల కోసం మొత్తం రూ. 117.30 కోట్ల నిధులను కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య ఈ ప్రతిపాదనల వివరాలను తెలియజేస్తూ విద్యాశాఖ కార్యదర్శికి ఇటీవల లేఖ రాశారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా ఎంపిక చేసిన పది కళాశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం.. నూతన భవనాలను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
నూతన భవనాల నిర్మాణంతో పాటు.. విద్యార్థులకు మెరుగైన అభ్యాస అనుభవాన్ని అందించడానికి అధికారులు పలు కీలక సౌకర్యాల కల్పనకు ప్రతిపాదనలు చేశారు. ఇందులో ముఖ్యంగా.. స్మార్ట్ తరగతి గదుల (స్మార్ట్ క్లాస్రూమ్స్) ఏర్పాటు, విద్యార్థులకు డిజిటల్ అక్షరాస్యతను పెంచడం, కొత్త ఫర్నిచర్, సైన్స్ విద్యార్థుల కోసం అత్యాధునిక ప్రయోగశాలల ఏర్పాటు, లైబ్రరీల విస్తరణ వంటివి ఉన్నయి.
మొత్తం రూ. 117.30 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం వాటా (60%) కింద రూ. 70.38 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం వాటా (40%) కింద రూ. 46.92 కోట్లు భరించాల్సి ఉంటుంది. ఈ నిధుల కేటాయింపు ద్వారా ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్ కళాశాలలకు దీటుగా తయారవుతాయని విద్యాశాఖ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
ఈ పది కళాశాలల్లో.. హైదరాబాద్లోని నాంపల్లిలో ఉన్న ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల (GJC బాయ్స్), ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలు ఒకే ప్రాంగణంలో నడుస్తున్నాయి. ఇక్కడ ఏకంగా రూ. 27.30 కోట్లతో ఒక భారీ 'ఇంటిగ్రేటెడ్ భవనం' నిర్మించడానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ హైటెక్ భవనం ఈ ప్రాంతంలోని మైనారిటీ విద్యార్థులకు ఒక వరం కానుంది. మిగిలిన తొమ్మిది కళాశాలలకు ఒక్కొక్క దానికి సుమారు రూ. 10 కోట్లు.. ఇతర అవసరాల కోసం అదనంగా రూ. 8 కోట్లు కేటాయించాలని విద్యాశాఖ కోరింది.
ముఖ్యంగా అభివృద్ధి చేయనున్న కళాశాలల లిస్ట్ ఇదే..
జీజేసీ (బాయ్స్), జీవీజేసీ, నాంపల్లి (హైదరాబాద్)
జీజేసీ ఫలక్నుమా (బాయ్స్ & గర్ల్స్) (హైదరాబాద్)
జీజేసీ గర్ల్స్, నల్గొండ
జీజేసీ బాయ్స్, ఆదిలాబాద్
జీజేసీ, భైంసా (నిర్మల్)
జీజేసీ, ముధోల్ (నిర్మల్)
జీజేసీ గర్ల్స్, మహబూబ్నగర్
జీజేసీ బాయ్స్, నిజామాబాద్
ఎంఏఎం జీజేసీ గర్ల్స్, నాంపల్లి (హైదరాబాద్)
జీజేసీ, బోరబండ (హైదరాబాద్)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa