రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఓవర్లోడ్, నిబంధనల ఉల్లంఘనలపై దృష్టి సారించి 33 జిల్లాల్లో ప్రత్యేక తనిఖీ బృందాలతోపాటు మూడు రాష్ట్రస్థాయి స్క్వాడ్లను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు రోడ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ రవాణా నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కఠినంగా వ్యవహరిస్తున్నాయి.
గత 10 రోజుల్లోనే ఈ స్క్వాడ్లు 4,748 కేసులు నమోదు చేశాయి. ఓవర్లోడ్, పర్మిట్ లేకుండా నడిపినందుకు 3,420 భారీ వాహనాలను సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఇకపై రాజీ లేని వైఖరి అమలు చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
కొత్త నిబంధనల ప్రకారం ఓవర్లోడ్తో పట్టుబడిన వాహనాన్ని మొదటిసారే సీజ్ చేస్తారు. రెండోసారి పట్టుబడితే వాహన పర్మిట్, డ్రైవర్ లైసెన్స్ రెండూ శాశ్వతంగా రద్దు చేయనున్నారు. ఇది రవాణా రంగంలో భారీ మార్పును తీసుకొచ్చే అడుగు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇకపై భారీ వాహన డ్రైవర్లు లైసెన్స్ రెన్యువల్ సమయంలో తప్పనిసరిగా రీఫ్రెషర్ ట్రైనింగ్కు హాజరు కావాలి. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై మరింత అవగాహన కల్పించే ఈ శిక్షణ ద్వారా ప్రమాదాల సంఖ్య తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తంమీద రోడ్లపై క్రమశిక్షణ పెంచేందుకు ఈ చర్యలు దోహదపడతాయన్న నమ్మకం వ్యక్తమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa