ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటమితో బీఆర్ఎస్‌కు పట్ట పగలే చుక్కలు కనపడుతున్నాయి: మంత్రి శ్రీధర్ బాబు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 21, 2025, 07:29 PM

తెలంగాణలో అధికార మార్పిడి జరిగిన తర్వాత కూడా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరు మారడం లేదని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా.. పరిశ్రమల విధానం (ఇండస్ట్రియల్ పాలసీ), భూముల కన్వర్షన్ అంశాలపై కేటీఆర్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. శుక్రవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు, కేటీఆర్ ఆలోచనల్లో ప్రజలు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా మార్పు రావడం లేదని ఆవేశపడ్డారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్, రాష్ట్ర ఖజానాను ఆర్థిక ఆరాచకం వైపు నెట్టిందని.. అడ్డగోలుగా అప్పులు చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై కేటీఆర్ పనిగట్టుకుని అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.


భూముల కన్వర్షన్ (లీజ్ భూములను ఫ్రీహోల్డ్‌గా మార్చడం) విషయంలో కేటీఆర్ చేస్తున్న విమర్శలను మంత్రి శ్రీధర్ బాబు చీల్చిచెండాడారు. అసలు విషయం ఏమిటంటే.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే లీజు భూములను ఫ్రీహోల్డ్‌గా మార్చడానికి జీవోలు తీసుకొచ్చిందని ఆయన వివరించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది కేవలం ఆ జీవోల అమలు మాత్రమేనని స్పష్టం చేశారు.


“కేటీఆర్ చెప్పేది 30 శాతం భూమి విలువ కాదు. అది కేవలం కన్వర్షన్ ఫీజు మాత్రమే. లీజు భూములకు, ఫ్రీహోల్డ్ భూములకు సంబంధం లేకుండా కేటీఆర్ అబద్ధాలు చెప్తున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక భూములు కన్వర్షన్ అయ్యాయి. అప్పుడు లేని రాజకీయం ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు?” అని మంత్రి ప్రశ్నించారు. ఈ కన్వర్షన్‌కు, భూమి విలువకు ముడిపెట్టి కేటీఆర్ కేవలం రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని, ఇది చాలా తప్పుడు విధానమని అన్నారు.


‘హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా మార్చకుండా బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడుతున్నారు. జూబ్లీహిల్స్‌లో ఓడిపోయిన తర్వాత బీఆర్‌ఎస్‌కు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి’ అంటూ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సొంత భూములు ఉన్నవారు కన్వర్షన్ చేసుకోవచ్చునని.. దీనిపై కేటీఆర్ గాలి మాటలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితోనే పారిశ్రామిక విధానాలను అమలు చేస్తోందని.. దీనికి అడ్డుపడితే చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను బెదిరించి ఆపాలని చూస్తున్న బీఆర్‌ఎస్ నాయకుల తీరును మంత్రి తప్పుబట్టారు.


బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ నాయకులు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఘాటు విమర్శలు చేశారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "పచ్చకామెర్లు వచ్చిన వ్యక్తికి ప్రపంచమంతా పచ్చగానే కనిపిస్తుంది. ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి కూడా అలాగే ఉంది," అని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రజల పాలన కంటే ఫామ్ హౌస్ పాలనే ఎక్కువగా నడిచిందని ఆరోపించారు.


కేటీఆర్ చేస్తున్న విమర్శలకు సరైన ఆధారం లేదని.. అందుకే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. ‘కేసీఆర్ ఇంట్లో లాగా, రేవంత్ రెడ్డి ఇంట్లో అందరికీ రాజకీయ పదవులు లేవు కదా’ అని చురక అంటించారు. మంచి పనులు చేస్తున్న తమ ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ అడ్డుకుంటోందని.. వ్యాపారవేత్తలను బెదిరించడం కేటీఆర్‌కు తగదని కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా కేటీఆర్ బుద్ధి మారడం లేదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa