ఒక పార్టీలో కొనసాగుతూ, ముఖ్యమంత్రిని కలవకపోతే నియోజకవర్గం 30 ఏళ్లు వెనక్కి పోతుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసమే తాము ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన కృష్ణమోహన్ రెడ్డి, అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో సభాపతి ఆయనకు నోటీసులు జారీ చేయగా, ఆయన వివరణ ఇచ్చారు.పార్టీ మారిన అంశంపై తాను స్వయంగా రెండుసార్లు విచారణకు హాజరయ్యానని ఆయన వెల్లడించారు. తనను అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగాలంటే ముఖ్యమంత్రిని కలవడం తప్పనిసరి అని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత పనుల కోసం తాను ఎప్పుడూ ముఖ్యమంత్రిని కలవలేదని ఆయన స్పష్టం చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు పార్టీలకు అతీతంగా ఓట్లు వేస్తారని ఆయన అన్నారు. పార్టీ ఫిరాయింపు అనేది పూర్తిగా సభాపతి విచక్షణపై ఆధారపడి ఉంటుందని, తీర్పు తనకు అనుకూలంగానే ఉంటుందని ఆశిస్తున్నానని అన్నారు. అభివృద్ధి అజెండాతో ముందుకు సాగే పార్టీతోనే తన భవిష్యత్తు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని, అదే విధంగా గద్వాల ఓటర్లు కూడా అభివృద్ధిని కోరుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa