ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సులు సురక్షితమని, ప్రైవేటు ట్రావెల్స్ను నమ్మొద్దని రోజూ ప్రకటనలు ఇస్తున్న ఆర్టీసీ శాఖ... అదే బస్సుల్లో ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు ఎంత అడిగినా వారు దిగాల్సిన స్టాప్లలో బస్సు ఆపకపోవడం, ఆపమని అడిగితే సిబ్బంది నుంచి వాగ్వాదాలు, కొన్ని సార్లు అసభ్య పదజాలం కూడా వినిపిస్తోంది. ఈ సమస్య గత కొన్ని నెలలుగా ముమ్మరంగా కొనసాగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేకించి ఏన్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వివిధ గ్రామాల నుంచి వచ్చే విద్యార్థినులు ఈ ఇబ్బందిని ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ఉదయం కాలేజీకి వెళ్లేటప్పుడు కానీ, సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు కానీ కాలేజీ ఆవరణలో లేదా సమీప స్టాప్లో బస్సు ఆపకపోవడం సర్వసాధారణంగా మారింది. దీంతో అమ్మాయిలు రోడ్డు మీదే నడిచి రావాల్సి వస్తోంది. రాత్రి ఆలస్యమైతే భయం, ఒంటరిగా వెళ్లాలంటే ఇంకా భయం – ఇలాంటి పరిస్థితి నెలకొంది.
బస్సు ఆపమని అడిగితే “టైమ్ లేదు, ముందు స్టాప్లో దిగు” అంటూ డ్రైవర్లు, కండక్టర్లు కర్కశంగా సమాధానం ఇస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు సిబ్బంది “మీరు ఫ్రీ బస్సులో వస్తున్నారు కదా, ఇంకా ఏం కావాలి?” అని తిట్టిన సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఉచిత బస్సు పథకం వల్ల ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగినా, బస్సుల సంఖ్య, సిబ్బంది ప్రవర్తన మాత్రం అదే స్థాయిలో ఉండటంతో ఈ గందరగోళం నెలకొందని అందరూ ఒక్కటే అంటున్నారు.
ప్రజలు ప్రైవేటు వాహనాలను వదిలేసి ఆర్టీసీ బస్సులకు వస్తేనే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ప్రచారం చేస్తున్న ఆర్టీసీ యాజమాన్యం... తమ సొంత బస్సుల్లోనే ప్రయాణికులకు ఇంత ఇబ్బంది కలిగిస్తుంటే, ఆ మాటలు నమ్మాలా? వెంటనే సమస్యను పరిష్కరించి, సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, అవసరమైన చోట స్టాప్లలో బస్సులు ఆపేలా కఠిన ఆదేశాలు జారీ చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. లేకపోతే “సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీనే ఎంచుకోండి” అన్న ప్రకటనలు కేవలం హాస్యాస్పదంగా మిగిలిపోతాయని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa