అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలును అధికారులు పటిష్టంగా పర్యవేక్షిస్తున్నారు . డబ్బు, మద్యం, మాదక ద్రవ్యాలు అక్రమంగా పంపిణీ జరగకుండా ఉండేందుకు తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో భారీ స్థాయిలో నగదు, ఇతర వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు చేసిన తనిఖీల్లో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమంగా తరలిస్తున్న పలు వస్తువులను ఏజెన్సీలు సీజ్ చేశాయి.
అధికారులు రూ. 3.3 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. 701 లీటర్ల మద్యం సీజ్ చేయబడింది. ఈ తనిఖీల్లో 2 కిలోలకు పైగా గంజాయి, 0.11 గ్రాముల ఎండీఎంఏ వంటి మాదక ద్రవ్యాలను కూడా పట్టుకున్నారు. వీటి విలువ రూ. 1 లక్షా 97 వేల 600 ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినందుకు నియోజకవర్గంలో ఇప్పటివరకు 24 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో 15 కేసులు ఎన్నికల సంబంధిత హింసకు, ఏడు కేసులు అనుమతి లేని సమావేశాలు లేదా ప్రసంగాలకు రెండు కేసులు ఓటర్లను ఆకర్షించడానికి నగదు, సరుకుల పంపిణీకి సంబంధించినవిగా గుర్తించారు.
పటిష్టమైన పర్యవేక్షణ కోసం 45 ఫ్లయింగ్ స్క్వాడ్లు , 45 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాల వాహనాలకు జీపీఎస్, పీటీజెడ్ కెమెరాలను అమర్చి, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి 24 గంటలు పర్యవేక్షిస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నవంబర్ 11న పోలింగ్, నవంబర్ 14న కౌంటింగ్ జరగనుంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ , బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత , బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2,08,561, మహిళలు 1,92,779, ఇతరులు 25 మంది ఉన్నారు. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. వీటిలో 54 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి, ఆ ప్రాంతాలలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa