ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్రైవింగ్‌ పరీక్షలు లేకుండా లైసెన్సులు..!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 08, 2025, 10:11 PM

తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా రోడ్డు ప్రమాదాలు పెరగడానికి ప్రధాన కారణం నిబంధనలను పట్టించుకోకుండా డ్రైవింగ్ చేయడమే అని నివేదికల ద్వారా స్పష్టమవుతోంది. ముఖ్యంగా భారీ వాహనాల డ్రైవర్లలో నైపుణ్యం, శిక్షణ, బాధ్యత పూర్తిగా కొరవడడం వల్ల ప్రతిరోజూ ఎంతోమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. మొన్న కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం, నిన్న చేవెళ్లలో టిప్పర్ లారీ డ్రైవర్ డ్రైవింగ్.. తాజాగా నల్గొండ జిల్లాలో జరిగిన ఇన్నోవా కారు ప్రమాదం.. ఇలా ఏ ప్రమాదం గురించి చెప్పుకున్నా అందులో డ్రైవర్ తప్పే కనిపిస్తోంది. వారికి ఎక్కువ శాతం ట్రాఫిక్ నిబంధనలపై కనీస అవగాహన లేకపోవడం, ‘డ్రైవింగ్ సెన్స్’లేకుండా దూసుకెళ్లడం రహదారి భద్రతకే సవాల్ విసురుతోంది.


రవాణా రంగాన్ని ఉపాధిగా ఎంచుకుని వచ్చే కొత్తతరం డ్రైవర్లలో చాలామందికి శిక్షణ, నైపుణ్యం లేకపోవడం తీవ్రమైన సమస్యగా మారుతోంది. లారీలు, టిప్పర్లు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు వంటి భారీ వాహనాలను నడిపే వీరు అరకొర పరిజ్ఞానంతోనే రోడ్లపైకి వచ్చి, పరిమితికి మించిన వేగంతో దూసుకెళ్తూ వాహనాలను అదుపు చేయలేక పెను ప్రమాదాలకు కారణమవుతున్నారు. రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఈ నిర్లక్ష్యానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఓవర్‌లోడ్‌తో పాటు మితిమీరిన వేగంతో వచ్చిన టిప్పర్ డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయలేకపోవడం వల్లనే ఈ విషాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు సుమారు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఒక్క ఘటనే డ్రైవర్ల నైపుణ్య లోపాన్ని, అధికారుల పర్యవేక్షణ వైఫల్యాన్ని వేలెత్తి చూపుతోంది.


 సాధారణంగా శిక్షణ లేని డ్రైవర్లు రోడ్లపైకి రావడానికి ప్రధాన కారణం డ్రైవింగ్ లైసెన్సులు అంగడి సరుకుల్లా లభించడం. రవాణా శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లు , ఆర్టీఏ అనుమతితో నడిచే డ్రైవింగ్ స్కూళ్లు, ఏజెంట్ల దళారి వ్యవస్థ ఈ నాసిరకం డ్రైవర్లను ఉత్పత్తి చేయడానికి మూకుమ్మడిగా దోహదం చేస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో లైసెన్సుల మంజూరులో ‘డబ్ల్యూ’ కోడ్ దందా బాహాటంగా నడుస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ‘డబ్ల్యూ’ అంటే ‘వితౌట్ టెస్ట్’ అని అర్థం. అంటే.. డ్రైవింగ్ పరీక్షలు లేకుండానే.. ఏమాత్రం నైపుణ్యం లేని అభ్యర్థులకు కూడా భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి లైసెన్సులు ఇచ్చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం వంటి శివారు కార్యాలయాల్లో ఈ దందా ఎక్కువగా సాగుతున్నట్లు తెలుస్తోంది.


టిప్పర్లు, లారీలు, డీసీఎంలు వంటి సరుకు రవాణా వాహనాలను, అలాగే ఆర్టీసీ అద్దె బస్సులు, స్కూల్ బస్సులు నడిపే చాలామంది డ్రైవర్లలో రోడ్డు నియమాలపై కనీస అవగాహన ఉండటం లేదు. ఈ డ్రైవర్లు ఒకవైపు భారీ వాహనాలను నడుపుతూనే ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ, మొబైల్ ఫోన్లలో మాట్లాడుతూ కిలోమీటర్ల కొద్దీ దూసుకుపోతున్నారు. ఓవర్‌టేక్ చేసే విషయంలో సరైన సెన్స్ పాటించకపోవడం, నిద్రలేమితో డ్రైవింగ్ చేయడం వంటివి చేస్తున్నారు.


ఈ ఘోర ప్రమాదాలను అరికట్టాలంటే.. డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా మార్చాలి. శిక్షణ కేంద్రాలు, టెస్ట్ ట్రాక్‌ల పర్యవేక్షణను పటిష్టం చేయాలి. ముఖ్యంగా భారీ వాహనాల డ్రైవర్లకు నిర్బంధ మానసిక, శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించాలి. అప్పుడే రోడ్లపై మృత్యు యాత్రకు తెరపడి.. ప్రజలకు భద్రత లభిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa