సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలం కక్కర్వాడ గ్రామంలో ప్రేమ వివాహానికి సంబంధించిన కక్ష్యపూరిత చర్య తీవ్ర కలకలం సృష్టించింది. కూతురు తన ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో ఓ తండ్రి, కొడుకు కలిసి అబ్బాయి కుటుంబంపై దాడికి పాల్పడటమే కాకుండా, వారి ఇంటికి నిప్పుపెట్టిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం ప్రకారం, గ్రామానికి చెందిన విఠల్ కూతురు అదే గ్రామానికి చెందిన రాధాకృష్ణను ప్రేమించింది. కుటుంబసభ్యులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో యువతి తన ప్రేమించిన వ్యక్తిని రహస్యంగా వివాహం చేసుకుంది.
ప్రేమ వివాహం జరిగిన విషయం విఠల్కు తెలియడంతో అతను తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యాడు. తమ మాట కాదని కూతురు లవ్ మ్యారేజ్ చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని విఠల్, కక్ష తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన కుమారుడు పాండుతో కలిసి రాధాకృష్ణ ఇంటిపై దాడికి పాల్పడ్డాడు. కళ్ళెదుటే దాడి జరుగుతుండగా, రాధాకృష్ణ తండ్రి (బోయిని రాములు)పై తండ్రీకొడుకులు అత్యంత ఘోరంగా భౌతిక దాడికి దిగారు. ఈ దాడితో బాధితుడు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
దాడితో ఆగకుండా, విఠల్, పాండు ఇద్దరూ కలిసి రాధాకృష్ణ నివాసానికి నిప్పు పెట్టారు. మంటలు వేగంగా వ్యాపించడంతో ఇల్లంతా ధ్వంసమై, ఆ కుటుంబానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఇరుగుపొరుగు వారు వెంటనే గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ దారుణ చర్య స్థానికంగా తీవ్ర భయాందోళనలకు దారితీసింది.
ఈ ఘటనపై బాధితుడు బోయిని రాధాకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రేమ వివాహం విషయంలో ఇరు కుటుంబాల మధ్య ఉన్న పాత కక్షలు, విబేధాలే ఈ దాడికి, నిప్పు పెట్టడానికి దారితీశాయని పోలీసులు భావిస్తున్నారు. పరువు పేరుతో జరిగిన ఈ ఘోర దాడి, ఆస్తి నష్టంపై కేసు నమోదు చేసి, తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పహారా ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa