ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీఆర్ఎస్ దుష్ట సంప్రదాయాన్ని తీసుకొచ్చింది: సీఎం రేవంత్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 31, 2025, 10:06 PM

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా వెంగళరావు నగర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన రోడ్‌షోలో.. ఆయన ప్రత్యర్థి పార్టీలపై, ముఖ్యంగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ ప్రచారంలో.. దివంగత నేత పీ జనర్ధన్ రెడ్డిని(పీజేఆర్) స్మృతిని ప్రధానాంశంగా తీసుకుని.. ప్రస్తుత రాజకీయాలను విశ్లేషించారు.


సెంటిమెంట్ పేరుతో ప్రజల ముందుకు వస్తున్న బీఆర్‌ఎస్‌పై రేవంత్ రెడ్డి గట్టిగా మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. నగరానికి గోదావరి జలాలను అందించిన మహనీయుడు పీజేఆర్. ఆయన అకాల మరణానంతరం, ఆయన పట్ల గౌరవంతో నాటి రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడు సైతం ఎన్నిక ఏకగ్రీవం చేయడానికి సహకరించారు. ఆనాడు పీజేఆర్ గౌరవార్థం రాజకీయ వైరుధ్యాన్ని పక్కన పెట్టారు. కానీ, ఆ తర్వాత పీజేఆర్ కుటుంబంపై పోటీకి అభ్యర్థిని నిలబెట్టి.. ఉప ఎన్నికల్లో దుష్ట సంప్రదాయాన్ని తీసుకొచ్చింది బీఆర్‌ఎస్ (అప్పటి టీఆర్ఎస్) నేతలే కాదా?" అని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. సానుభూతి ఓట్లు అడిగే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌కు లేదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఉప ఎన్నికల రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే దిశగా సాగాయి.


రాజకీయాల్లోని ఎత్తుపల్లాలను ప్రస్తావిస్తూ.. అవకాశం అందరికీ అన్నిసార్లు రాకపోవచ్చు. అవకాశం వచ్చినప్పుడు, మన కోసం నిస్వార్థంగా కష్టపడే వ్యక్తిని గెలిపించుకోవాలి. మన తరపున పోరాడే నాయకుడిని గెలిపించకపోతే అది చారిత్రక తప్పిదమే అవుతుంద అని ఓటర్లకు హితవు పలికారు. జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య ఉన్న సంబంధాన్ని 'ఫెవీకాల్ బంధం'గా అభివర్ణించిన రేవంత్ రెడ్డి.. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీని గెలిపించడానికి 'అవయవదానం' చేసిందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ అభివృద్ధిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు కేంద్రమంత్రులుగా ఉన్నా సాధించిందేమీ లేదని.. వారు జూబ్లీహిల్స్‌ వైపు కనీసం చూడలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ నాయకులు ఓట్ల కోసం ఇంటి ముందుకు వస్తే.. తగిన విధంగా 'వాతలు పెట్టండి' అంటూ ఓటర్లకు పిలుపునిచ్చాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa