ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'డిజిటల్ అరెస్ట్' పేరుతో భారీ సైబర్ నేరం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 31, 2025, 04:07 PM

హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. 'డిజిటల్ అరెస్ట్' పేరుతో అమాయకులను భయభ్రాంతులకు గురిచేసి భారీగా డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా శ్రీనగర్ కాలనీకి చెందిన 78 ఏళ్ల రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి వీరి వలలో చిక్కి రూ.51 లక్షలు పోగొట్టుకున్నారు.వివరాల్లోకి వెళ్ళితే.... బాధితుడికి కొన్ని రోజుల క్రితం ఒక అపరిచిత నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తాను ముంబై క్రైమ్ బ్రాంచ్ ఏసీపీనని పరిచయం చేసుకున్నాడు. బాధితుడి మొబైల్ సిమ్ కార్డును బాంబు పేలుళ్లు, కిడ్నాప్ కేసుల్లో వాడారని, అతని పేరు మీద ఇతరులు మరికొన్ని సిమ్ కార్డులు తీసుకున్నారని నమ్మబలికాడు. అంతేకాకుండా మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్నాయంటూ సీబీఐ పేరుతో ఉన్న నకిలీ నోటీసులను కూడా చూపించి తీవ్రంగా బెదిరించాడు.ఆ తర్వాత బాధితుడిని వీడియో కాల్ ద్వారా 'డిజిటల్ అరెస్ట్' చేశారు. ఎవరితోనూ మాట్లాడకుండా, బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. కేసు నుంచి బయటపడాలంటే బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులో 95 శాతం బదిలీ చేయాలని, విచారణ పూర్తయ్యాక ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తామని నమ్మించారు. తీవ్ర భయాందోళనలకు గురైన బాధితుడు, వారు చెప్పిన ఖాతాలకు రూ.51 లక్షలు బదిలీ చేశాడు. కొద్దిసేపటి తర్వాత మోసపోయానని గ్రహించి సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa