ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మావోయిస్టు పార్టీని అంతమొందించడం సాధ్యంకాని పని

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 31, 2025, 03:51 PM

మావోయిస్టు పార్టీలో కొందరు నమ్మకద్రోహులు ఉన్నారని, బసవరాజు ఎన్‌కౌంటర్ వెనుక కోవర్ట్ ఆపరేషన్ జరిగిందని మాజీ మావోయిస్టు, కేంద్ర కమిటీ సభ్యుడు పల్లూరి ప్రసాద్‌రావు అలియాస్ చంద్రన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. 45 ఏళ్లుగా అజ్ఞాతంలో కొనసాగిన ఆయన, ఇటీవల తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ కగార్‌'తో మావోయిస్టు పార్టీకి నష్టం వాటిల్లినప్పటికీ, పార్టీని పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మావోయిస్టులను లేకుండా చేస్తామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన ఆచరణ సాధ్యం కాదని పేర్కొన్నారు. తాను ఆయుధాలు తీసుకుని మూకుమ్మడిగా లొంగిపోవడాన్ని సమర్థించనని, కేవలం తన అనారోగ్య కారణాలతోనే అజ్ఞాతం వీడానని చంద్రన్న స్పష్టం చేశారు.పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడుకాపూర్‌కు చెందిన చంద్రన్న, 1979లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్‌ఎస్‌యూ)తో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1980లో కిషన్‌జీ అనుచరుడిగా దండకారణ్యంలోకి ప్రవేశించి, 1981లో పీపుల్స్‌వార్‌లో చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2024 నాటికి కేంద్ర కమిటీ సభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర కమిటీకి మార్గదర్శకత్వం వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa