ట్రెండింగ్
Epaper    English    தமிழ்

17 ఏళ్ల కల సాకారం.. ఆ కానిస్టేబుళ్ల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 29, 2025, 08:39 PM

సుమారు 17 సంవత్సరాల క్రితం.. నాడు హోం మంత్రిగా ఉన్న జానారెడ్డి ఇచ్చిన హామీని.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చారు. సుమారు 17 సంవత్సరాల క్రితం అనగా 2008లో బలిమెల ఘటనలో అమరలైన గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్ల కుటుంబాలకు ఇంటి స్థలాలు కేటాయిస్తామని నాటి హోంమంత్రి జానా రెడ్డి హామీ ఇచ్చారు. తాజాగా సదరు పోలీసు కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇళ్ల పట్టాలు అందజేశారు. ఆ వివరాలు..


బలిమెల ఘటనలో ప్రాణాలు వదిలిన గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్లకు చెందిన కుటుంబాల 17 సంవత్సరాల ఎదురుచూపులకు ఇన్నాళ్లకు తెర పడింది. 17 ఏళ్ల క్రితం అనగా.. 2008లో ఏపీలోని బలిమెల రిజర్వాయర్ వద్ద మావోయిస్టులు.. గ్రేహౌండ్స్ బలగాలపై దాడి చేశారు. ఈ ఘటనలో 33 మంది కానిస్టేబుళ్లు అమరులయ్యారు. ఈక్రమంలో తాజాగా రేవంత్ ప్రభుత్వం వారి కుటుంబసభ్యులకు 200 గజాల ఇళ్ల స్థలాల తాలూకు పట్టాలు అందించింది. ఈ నెల 21న అమర వీరుల దినోత్సవం సందర్భంగా ఆ కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందచేశారు.


వాస్తవానికి గ్రేహౌండ్స్ పోలీసులు మరణించిన సమయంలో హోంమంత్రిగా ఉన్న జానారెడ్డి ఆ ఘటనలో మృతి చెందిన పోలీసుల కుటుంబసభ్యులకు 200 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తామని అప్పట్లోనే ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఆ హామీ ఫైళ్లకే పరిమితమైంది. ఈ క్రమంలో ఇటీవల డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన బి శివధర్ రెడ్డి బలిమెల ఘటనలో మరణించిన పోలీసుల కుటుంబాలకు ఇస్తామని పెండింగ్‌లో పెట్టిన ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.


ఇందుకోసం గాజులరామారాం వద్ద ఉన్న ప్రభుత్వ స్థలంలో బలిమెల ఘటనలో అమరులైన 33 మంది బాధిత పోలీసు కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అవకాశం ఉందనే విషయాన్ని ఆయన సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా అమరులైన పోలీసు కుటుంబాలకు ఇంకా అందని ఇళ్ల స్థలాల పైళ్లను ఉన్నతాధికారులు పరిశీలించడం ప్రారంభించారు.


ఈక్రమంలో నిజామాబాద్ జిల్లాలో 1989 నుంచి ఇప్పటి వరకు 18మంది అమర పోలీసు కుటుంబాలు ఇళ్ల స్థలం కోసం నిరీక్షిస్తున్నారని గుర్తించారు. ఇటీవల వీరిలో 9 కుటుంబాలకు ఇందల్వాయి సమీపంలోని గన్నారంలో 200 గజాల ఇంటి స్థలం పట్టాను డీజీపీ శివధర్ రెడ్డి అందచే శారు. బలిమెల సంఘటన జరిగినపుడు తాను ఎస్ఐబీ డీఐజీగా ఉన్నానని అప్పటి పోలీసు అమరుల కుటుంబాల బాధ తాను మర్చిపోలేనని తెలిపారు. నాటి అమర పోలీసుల ఇళ్ల స్థలాల సమస్యను మానవీయకోణంలో చూడాలని సీఎం రేవంత్ రెడ్డికి వివరించగానే.. ఆయన క్లియరెన్స్ ఇచ్చారని శివధర్రెడ్డి తెలిపారు.


ఇదే కాక.. ఇతర జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న పోలీసు అమరవీరుల ఇళ్ల స్థలాల సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు తమ పరిధిలో అమర పోలీసులకు సంబంధించిన ఇళ్ల స్థలాల సమస్యలు పెండింగ్లో ఉంటే ఆ విషయాన్ని తెలి యచేయాలని డీజీపీ కార్యాలయం నుంచి ఇటీవల ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa