ఖమ్మం జిల్లాను 'మొంథా' తుపాను వదలడం లేదు. బుధవారం తెల్లవారుజాము నుంచే చింతకాని మండలంలో భారీ వర్షం కురుస్తోంది. ఈ ఎడతెరిపి లేని వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో మండలంలో పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తుపాను ప్రభావంతో చింతకాని మండలంలోని నాగులవంచ-పాతర్లపాడు గ్రామాల మధ్య ఉన్న బండి రేపు వాగు ప్రమాదకరంగా మారింది. వాగు రహదారిపై దాదాపు రెండు అడుగుల మేర వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీని కారణంగా ఈ మార్గంలో వాహనాల రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. దీంతో పక్క గ్రామాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు, స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఇక, జిల్లాలో ముఖ్యమైన జలవనరులలో ఒకటైన మున్నేరు వాగు కూడా ప్రళయ స్వరూపాన్ని చూపిస్తోంది. చిన్న మండవ ప్రాంతం సమీపంలో మున్నేరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ఈ నేపథ్యంలో, స్థానిక ఎస్సై వీరేందర్ మండల ప్రజలను హెచ్చరించారు. నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు మరియు లోతట్టు ప్రాంతాల వారు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. ముఖ్యంగా వాగులు, వంతెనలు దాటే ప్రయత్నం చేయవద్దని, మున్నేరు ప్రవాహ ఉధృతిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సహకారం కోసం తక్షణమే పోలీసు లేదా రెవెన్యూ అధికారులను సంప్రదించాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa