బంగాళాఖాతంలో ఏర్పడి.. ఆంధ్రప్రదేశ్ను కకావికలం చేస్తున్న 'మొంథా' తుఫాను ప్రభావం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని తాకింది. దీని కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మొంథా తుఫాను తీవ్రత పెరగడంతో,.. ఆంధ్రప్రదేశ్ తీరం దాటిన తర్వాత దాని ప్రభావం తెలంగాణ తూర్పు, ఉత్తర జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాల తీవ్రత దృష్ట్యా.. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ను జారీ చేశారు. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
ఈ మూడు జిల్లాలతో పాటు.. జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ను కూడా మొంథా తుఫాను ప్రభావం తాకింది.
దీని కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం.. రోడ్లపై నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తుఫాను, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉంది. ముఖ్యంగా రెడ్ అలర్ట్ జారీ అయిన జిల్లాల్లో అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ అకాల వర్షాల వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న పంట నష్టపోకుండా టార్పాలిన్లను ఉపయోగించాలని , కొనుగోలు చేసిన ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు తరలించాలని వ్యవసాయ, పౌర సరఫరాల శాఖలను ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు రావద్దని.. విద్యుత్ స్తంభాలు, చెట్లు వంటి వాటి దగ్గర జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మొంథా తుఫాను ప్రభావం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నందున.. ప్రజలు వాతావరణ శాఖ ఇచ్చే తాజా అప్డేట్లను గమనిస్తూ.. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa