తెలంగాణ రాష్ట్రంలో జీవో 317 కారణంగా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయుల తాత్కాలిక బదిలీల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. దరఖాస్తుల స్వీకరణ గడువు ఆదివారంతో ముగియగా, మొత్తం 6,500 అప్లికేషన్లు అందినట్టు సమాచారం. తమ సొంత జిల్లా లేదా కోరుకున్న ప్రాంతానికి బదిలీ కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది టీచర్లలో, ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయుల్లో ఈ ప్రక్రియపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించేందుకు డీఈవోలు (జిల్లా విద్యాధికారులు) రంగంలోకి దిగారు. స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులు, ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియలో జరిగిన పొరపాట్లు, ఇతర ప్రత్యేక కారణాలపై వచ్చిన దరఖాస్తులను ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. రానున్న మూడు నుంచి నాలుగు రోజుల్లో ఈ స్క్రూటినీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
అయితే, అందిన మొత్తం 6,500 దరఖాస్తుల్లో నిబంధనల ప్రకారం సగం మంది ఉపాధ్యాయులు మాత్రమే అర్హత సాధించే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. దరఖాస్తుదారుల స్థానికత వివరాలు, ప్రస్తుత కేటాయింపులు, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లేని అప్లికేషన్లను ఈ పరిశీలనలో పక్కన పెట్టే అవకాశం ఉంది. ఈ స్క్రూటినీ పూర్తయిన తర్వాత అర్హులైన అప్లికేషన్ల జాబితాను డీఈవోలు ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి పంపించనున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ బదిలీలు ఉపాధ్యాయులకు తాత్కాలిక ఉపశమనం కల్పించే అవకాశం ఉంది. ఉద్యోగులకు తాత్కాలిక డిప్యుటేషన్ల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా స్పౌజ్, హెల్త్, మ్యూచువల్ వంటి కేటగిరీల్లో అవకాశం రాని జీవో 317 బాధితులకు ఈ తాత్కాలిక బదిలీల ద్వారా ఊరట లభించనుంది. తుది జాబితా ప్రభుత్వానికి చేరిన వెంటనే బదిలీల ప్రక్రియ వేగం పుంజుకునే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa