హైదరాబాద్ నగరంలో నిరాదరణకు గురవుతున్న గోవులకు సురక్షిత ఆశ్రయం కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎన్కేపల్లి గ్రామంలో 100 ఎకరాల సువిశాల ప్రభుత్వ భూమిలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇటీవల రూ. 157 కోట్లతో పాలనాపరమైన అనుమతులు మంజూరు చేయడంతో పనులు వేగవంతమయ్యాయి.హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (HGCL) ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తోంది. ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు గోశాల నిర్మాణానికి కేటాయించిన భూమిని పూర్తిస్థాయిలో సర్వే చేసి, హద్దులు నిర్ణయించి హెచ్ఎండీఏకు అధికారికంగా అప్పగించారు. ప్రస్తుతం అధికారులు ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే నిర్మాణ పనులు మొదలుకానున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక ముఖ్యమైన మానవతా దృక్పథాన్ని హెచ్ఎండీఏ ప్రదర్శించింది. గోశాలకు కేటాయించిన ప్రభుత్వ భూమిని గత కొన్నేళ్లుగా సుమారు 40 నిరుపేద కుటుంబాలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. గోశాల నిర్మాణం వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. స్పందించిన హెచ్ఎండీఏ అధికారులు వారితో చర్చలు జరిపి, ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపారు.ప్రతి కుటుంబానికి అదే ప్రాంతంలో 300 గజాల నివాస స్థలం కేటాయించడంతో పాటు కుటుంబంలో ఒకరికి గోశాలలోనే ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అధికారుల సానుకూల స్పందనతో సంతృప్తి చెందిన ఆ కుటుంబాలు భూమిని అప్పగించేందుకు అంగీకరించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa