తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని, కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే సూచనలున్నాయని తెలిపింది. ఈ మేరకు శనివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది.వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, అక్టోబర్ 25న రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అక్టోబర్ 26న ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి.అక్టోబర్ 27 నుంచి వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.అక్టోబర్ 28, 29 తేదీల్లో పెద్దపల్లి, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్తో పాటు పలు ఉమ్మడి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈదురు గాలులతో కూడిన వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నమోదవుతాయని పేర్కొంది. అక్టోబర్ 30 తర్వాత వర్షాల తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది.భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, ట్రాఫిక్కు అంతరాయం కలగడం, విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. రైతులు, ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, పాత భవనాలకు దూరంగా ఉండాలని సూచించింది. జిల్లా యంత్రాంగాలు అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa