తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యారంగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సంస్కరణలకు ఆమోదముద్ర వేశారు. రాష్ట్రంలోని విద్యార్థులకు మరింత నాణ్యమైన, ఆచరణాత్మక విద్యను అందించే లక్ష్యంతో ఇంటర్ బోర్డు ప్రతిపాదనలను సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సమూల మార్పులు వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుండి అమలులోకి వస్తాయి. విద్యార్థుల సమగ్ర వికాసం, జాతీయ స్థాయి పోటీలకు వారిని సిద్ధం చేయడమే ఈ సంస్కరణల ప్రధాన ఉద్దేశం.
ఇప్పటివరకు కేవలం సెకండియర్ విద్యార్థులకు మాAత్రమే పరిమితమైన ప్రాక్టికల్స్ (ప్రయోగ పరీక్షలు) విధానాన్ని ఇకపై ఫస్టియర్ విద్యార్థులకు కూడా విస్తరించనున్నారు. సైన్స్ గ్రూపులైన ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు మొదటి సంవత్సరం నుంచే ల్యాబ్లలో ప్రయోగాత్మక అనుభవాన్ని కల్పించడం ద్వారా సైద్ధాంతిక పరిజ్ఞానంతో పాటు చేతిపని నైపుణ్యాలను మెరుగుపరచడం ఈ మార్పులోని కీలక అంశం. ఈ నిర్ణయం ద్వారా ఇంటర్ విద్యార్థులు తొలి నుంచే తమ సబ్జెక్టులపై పూర్తి అవగాహన పెంచుకోవడానికి అవకాశం లభిస్తుంది.
అంతేకాకుండా, ఇంటర్ పరీక్షల్లో మార్కుల కేటాయింపు విధానంలో కూడా ముఖ్యమైన మార్పు చేశారు. అన్ని సబ్జెక్టుల్లో ఇకపై 80 శాతం మార్కులకు రాత పరీక్ష, మిగిలిన 20 శాతం మార్కులను 'ఇంటర్నల్ అసెస్మెంట్స్' (అంతర్గత మార్కులు)కు కేటాయించనున్నారు. ఈ 80:20 నిష్పత్తి విధానం అమలుతో విద్యార్థులు సంవత్సరం పొడవునా చదువుపై దృష్టి సారించేలా ప్రోత్సహిస్తుంది. కేవలం తుది పరీక్షలపైనే కాకుండా, క్లాస్వర్క్, ప్రాజెక్టులు, హాజరు వంటి అంశాల ఆధారంగా ఇంటర్నల్ మార్కులు లభిస్తాయి.
విద్యార్థులకు మరింత విస్తృతమైన ఎంపికలను అందించడంలో భాగంగా ఇంటర్లో కొత్తగా 'ACE' (అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్) గ్రూపును ప్రవేశపెట్టనున్నారు. వాణిజ్య రంగంలో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా, అకౌంటెన్సీపై ఎక్కువ దృష్టి సారించాలనుకునే విద్యార్థులకు ఈ కొత్త గ్రూపు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సంస్కరణలు తెలంగాణ ఇంటర్ విద్యను మరింత విద్యార్థి-స్నేహపూర్వకంగా, ఆచరణాత్మకంగా, జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మారుస్తాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa