తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన ఎన్నికల హామీలలో కీలకమైనది వరిలో సన్నవడ్లకు క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్ అందించే పథకం. అయితే ఈ పథకం అమలులో ఆలస్యం అవుతోంది. గత యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసి ఆరు నెలలు గడుస్తున్నా.. సన్న ధాన్యం బోనస్ డబ్బులు నేటికీ పూర్తిగా చెల్లించలేదు.
బోనస్ చెల్లింపుల్లో జాప్యం..
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొద్ది మంది రైతుల ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమ అయ్యాయి. సుమారు 90 శాతం రైతుల ఖాతాల్లో ఈ బోనస్ డబ్బులు ఇంకా జమ కాలేదు. దీనికి ప్రధాన కారణం సన్న వడ్లకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన కొన్ని ప్రమాణాలు పాటించకపోవడమేనని తెలుస్తోంది. కాంగ్రెస్ హామీకి రైతుల్లో విశేష స్పందన లభించింది. అయినప్పటికీ.. బోనస్ సొమ్ము ఖాతాల్లో జమ కాకపోవడంపై రైతుల్లో అసంతృప్తి నెలకొంది. సన్న వడ్లు పండించినప్పటికీ.. నిర్దేశించిన ప్రమాణాలు పాటించకపోవడం వల్ల కొంతమంది రైతులకు బోనస్లు జమ కావడం లేదని వ్యవసాయ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
రైతులు బోనస్ పొందాలంటే ధాన్యం నాణ్యత విషయంలో వ్యవసాయ శాఖ నిర్దేశించిన నియమాలను తప్పనిసరిగా పాటించాలి. వడ్ల గింజ పొడవు, వెడల్పుల నిష్పత్తి సరిగా ఉండాలి. గింజ పొడవు 6 మిల్లీమీటర్లు (mm), వెడల్పు 2 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉండాలి. గ్రెయిన్ కాలిపర్ మెషీన్తో కొలిచినప్పుడు.. వడ్ల పొడవు, వెడల్పుల నిష్పత్తి 2.5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉండే ధాన్యానికి మాత్రమే బోనస్ కోసం ప్రాధాన్యం ఇస్తారు.
ఈ కొలతల నిబంధనలు సరిగా లేకపోతే.. ఆ ధాన్యాన్ని సన్నవడ్ల రకంగా గుర్తించడానికి అధికారులు నిరాకరిస్తున్నారు. దీనివల్ల బోనస్ డబ్బులు రైతులకు చేరడం లేదు. సరైన సన్నవడ్ల దిగుబడి పొందాలంటే.. విత్తనాల ఎంపికలో రైతులు తప్పక జాగ్రత్త వహించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం.. తెలంగాణలో ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోళ్లు మొదలైన సందర్భంగా.. రైతులు తమ పంట నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకుని.. బోనస్కు అర్హత పొందేలా ప్రయత్నించాలని ప్రభుత్వం సూచిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa