ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ మోసం .. తలసాని శ్రీనివాస్ యాదవ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 29, 2025, 07:38 PM

బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ వస్తోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42 శాతం రిజర్వేషన్‌లకు చట్టబద్ధత కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామన్న కాంగ్రెస్.. ఇప్పుడు పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకాలను ప్రజలే తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.


బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ల అమలుపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆగస్టు 8న కరీంనగర్‌ జిల్లాలో బీసీల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున త్వరలోనే బీసీ ప్రతినిధుల బృందం రాష్ట్రపతిని కలవనుందని ఆయన తెలిపారు.


ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ నేతలు ఆ రోజు హామీ ఇచ్చారని, ఎలా చేస్తారని అడిగితే మా వ్యూహం మాకు ఉందన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నెపమంతా బీజేపీ, బీఆర్ఎస్‌పై నెట్టిస్తోందని మండిపడ్డారు. 42 శాతం రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని.. మరి కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల విషయంలో బీసీలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఆయన ప్రశ్నించారు. కేబినెట్‌లో మిగిలిన మూడు మంత్రి పదవులు బీసీలకు ఇచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. 42 శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా ఎన్నికలు వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీలు బొంద పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.


కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకత లేకుండా కులగణన చేసి, హడావుడిగా అసెంబ్లీలో బిల్లును పెట్టిందని తలసాని విమర్శించారు. ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చిందంటూ మండిపడ్డారు. రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్‌లో ఉండగానే ఆర్డినెన్స్ తెస్తామనడం రాజ్యాంగ విరుద్ధమని, అమలు కాదని తెలిసే కాంగ్రెస్ కాలయాపనతో బీసీలను మభ్య పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ధర్నా చేస్తామనడం కొత్త డ్రామాకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వైఖరి ప్రజల్లోకి తీసుకెళ్తామని తలసాని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa