ప్రస్తుత సమాజంలో ఉద్యోగ భద్రత అనేది ఒక సవాలుగా మారింది. ముఖ్యంగా ప్రైవేట్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అనిశ్చితితో నిండి ఉంటుంది. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని ఆందోళన వారిని వెంటాడుతుంది. ఈ నేపథ్యంలో.. తెలంగాణలోని 51,451 మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద పనిచేస్తున్న వీరి సర్వీసును 2026 మార్చి వరకు పొడిగించింది.
ఉద్యోగ భద్రతకు తాత్కాలిక భరోసా..
ఈ ఏడాది మార్చి నెలతోనే చాలా మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల గడువు ముగిసింది. మూడు నెలలుగా సర్వీస్ పొడిగింపుపై ఎటువంటి స్పష్టత లేకపోవడంతో వేలాది మంది ఉద్యోగులు ఆందోళన చెందారు. తాజాగా.. ప్రభుత్వం వారి సర్వీసును రెన్యువల్ చేయడంతో వారికి తాత్కాలికంగా ఊరట లభించింది. ఈ నిర్ణయం ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది.
ఇదే కాకుండా.. ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకం కింద పనిచేస్తున్న సుమారు 1,500 మంది ఉద్యోగుల సర్వీసును కూడా ప్రభుత్వం మరో ఏడాది పాటు కొనసాగించనుంది. అలాగే, NHM కింద వివిధ పథకాల్లో పనిచేస్తున్న అదనంగా 1,760 మంది ఉద్యోగులకు కూడా మరో ఏడాది పాటు పదవీకాలాన్ని పొడిగించారు. ఈ పొడిగింపులు వైద్యారోగ్య రంగంలో పనిచేస్తున్న వేలాది మందికి భద్రతను కల్పిస్తాయి.
కాంట్రాక్ట్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు..
భారతదేశంలో.. ముఖ్యంగా తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వ శాఖల్లో, సంస్థల్లో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ.. వారికి శాశ్వత ఉద్యోగుల మాదిరిగా ఉద్యోగ భద్రత, పింఛను, ఇతర ప్రయోజనాలు లభించడం లేదు. ప్రతీ కొద్ది కాలానికి వారి సర్వీసును పొడిగించాల్సి రావడం, ఆ సమయంలో తలెత్తే అనిశ్చితి ఉద్యోగులను మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుంది. ముఖ్యంగా.. ఆరోగ్య రంగంలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు కరోనా మహమ్మారి వంటి క్లిష్ట సమయాల్లో అద్భుతమైన సేవలను అందించారు. వారి సేవలకు గుర్తింపుగా శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్లు వస్తున్నాయి.
ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం ఉద్యోగులకు తాత్కాలిక ఊరటనిచ్చినప్పటికీ.. వారి దీర్ఘకాలిక భద్రతకు సంబంధించి స్పష్టమైన విధానం అవసరం. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని నిరుద్యోగ సంఘాలు, ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఇటీవల విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం పర్మినెంట్ చేసిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa