తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలం, హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి, ఎల్కతుర్తి ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 1వ తేదీలోగా ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టకపోతే మంజూరు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. నిరుపేదల సొంత ఇంటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం వివరాలు..
2024లో ప్రారంభమైన ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం.. రాష్ట్రంలోని పేదలందరికీ ఆశ్రయం కల్పించే బృహత్తర లక్ష్యంతో రూపొందించబడింది. ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇళ్లను కేటాయించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో కలిపి 4.5 లక్షల గృహ నిర్మాణాలకు రూ.22,500 కోట్ల బడ్జెట్ను కేటాయించారు.
ఈ పథకం కింద.. సొంత స్థలం ఉన్న లబ్ధిదారులకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తారు. భూమి లేనివారికి ఉచితంగా భూమితో పాటు ఆర్థిక సహాయం కూడా లభిస్తుంది. ఈ ఆర్థిక సహాయం నాలుగు విడతలుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ అవుతుంది. నిర్మాణ పురోగతిని బట్టి నిధులు విడుదల చేస్తారు. జిల్లా కలెక్టర్లు, ఇంజనీరింగ్ విభాగాలు నిర్మాణ ప్రక్రియను పర్యవేక్షిస్తాయి. నాణ్యతా ప్రమాణాలను, సకాలంలో పూర్తి అయ్యేలా చూస్తాయి.
మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లాలో పర్యటించినప్పుడు.. ఆగస్టు 1లోగా ముగ్గు వేసి నిర్మాణం ప్రారంభించకపోతే లబ్ధిదారుల ఇళ్ల మంజూరు రద్దు కావచ్చని గట్టిగా హెచ్చరించారు. ఈ గడువును పాటించాలని.. లేనిపక్షంలో ఆర్థిక సహాయం రద్దు చేయబడుతుందని ఆయన స్పష్టం చేశారు. మొదటి విడతలో సొంత భూమి ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తుండగా.. రెండవ విడతలో భూమి లేని నిరుపేదలకు అవకాశం కల్పిస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించిన మంత్రి.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను అందించడానికి కట్టుబడి ఉందని నొక్కి చెప్పారు. ఈ పథకంలో దళితులు, ఆదివాసీలు, అల్పసంఖ్యాకులు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రయోజనాలు అందేలా చూస్తామని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హత కలిగిన లబ్ధిదారులను గుర్తించడానికి ఈ సంవత్సరం జనవరి 16 నుంచి 25 వరకు సర్వే నిర్వహించారు. ఈ సర్వే ద్వారా అర్హత కలిగిన వారి వివరాలను ధృవీకరించి, జనవరి 26 నుంచి మార్పులను అమలు చేశారు. లబ్ధిదారులు తమ అర్హతను ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్ లేదా అప్లికేషన్ నంబర్ ఉపయోగించి తనిఖీ చేసుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, నిరుపేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, అందులో ఇందిరమ్మ ఇళ్లతో పాటు కొత్త రేషన్ కార్డులను అందజేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్డుల ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆహార భద్రత కల్పించే లక్ష్యం ఉంది.
ఈ పథకంలో కొన్నిచోట్ల అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ప్రభుత్వం పారదర్శకతను పెంచేందుకు ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా లబ్ధిదారులు తమ అప్లికేషన్ స్టేటస్ తనిఖీ చేసుకోవచ్చు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ ఇంటిని కూడా ప్రారంభించారు. గత పదేళ్లుగా ప్రజలు రేషన్ కార్డులు, ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడమే కాకుండా, గ్రామాలకు ప్రైవేట్ స్కూల్ బస్సు రాకుండా చేసి, పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తే ఆ గ్రామానికి ఐదు మంచి పనులు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ పథకం రాష్ట్రంలో నిరాశ్రయుల సంఖ్యను తగ్గించడంతో పాటు, సామాజిక, ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లను నిర్మించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa