ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిల్లల దత్తత ప్రక్రియ.. ఇక చాలా సులభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 19, 2025, 06:26 PM

దాంపత్య జీవితం సామరస్యంగా సాగాలంటే కుటుంబంలో సంపూర్ణత్వం ఉండాలి. కానీ.. పిల్లలు లేని లోటు చాలా మంది దంపతుల జీవితాల్లో తీరని వేదనను నింపుతోంది. పురిటి కేకలు లేని ఇల్లు, పసిపాప ఆటలు లేని ప్రాంగణం వారి గుండెలను పిండేస్తుంటాయి. ఆలయాలు, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ.. అనేక వైద్య చికిత్సలు చేయించుకుంటూ, నిరాశతో కూడిన జీవితాలను వెళ్లదీస్తుంటారు. బంధువుల గుచ్చిగుచ్చి మాట్లాడే మాటలు, సమాజం నుంచి ఎదురయ్యే చిన్నచూపు వారిని మరింత కుంగదీస్తాయి. ఈ మానసిక వేదన, అవమానాలు, తీరని దుఃఖం మధ్య.. పిల్లల దత్తత అనేది వారికి ఒక వరంలా మారుతుంది. అమ్మానాన్నలు లేని బిడ్డలకు ప్రేమను, ఆసరాను అందిస్తూనే.. తల్లిదండ్రులు కావాలనే వారి కలలను నెరవేరుస్తుంది.


దత్తత ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు..


గతంలో పిల్లలను దత్తత తీసుకునే ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉండేది. సుమారు 16 రకాల పత్రాలు సమర్పించాల్సి ఉండటంతో.. చాలా మంది దంపతులు అడ్డదారులు, అనధికారిక మార్గాలను ఎంచుకునేవారు. ఇది అనేక న్యాయపరమైన చిక్కులు, పోలీసు కేసులు, ఇతర సమస్యలకు దారితీసేది. ఈ ఇబ్బందులను తొలగించి, దత్తత ప్రక్రియను సరళీకృతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు.. కేవలం ఆరు ముఖ్యమైన పత్రాలు సమర్పించి దరఖాస్తు చేసుకుంటే.. ప్రక్రియ పూర్తి చేసేలా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అవకాశం కల్పిస్తోంది.


దత్తత తీసుకోవాలనుకునే వారు..


www.cara.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దంపతులు, శిశువు వివరాలన్నీ పూర్తి గోప్యంగా ఉంచబడతాయి. దరఖాస్తుతో పాటు దంపతుల ఫోటో, పాన్‌కార్డు, జనన ధ్రువపత్రం, నివాస ధ్రువపత్రం, ఆదాయ ధ్రువపత్రం, దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధులు లేనట్లు వైద్య అధికారి జారీ చేసిన ధ్రువపత్రం, వివాహ నమోదు పత్రం వంటివి సమర్పించాలి. దరఖాస్తు చేసుకునే సమయంలో రూ.60,000.. బిడ్డను స్వీకరించేటప్పుడు రూ.40,000 ప్రభుత్వానికి డీడీ రూపంలో చెల్లించాలి. దరఖాస్తు చేసుకున్న వారికి లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ ఇస్తారు. ఆ తర్వాత సీనియారిటీ ప్రకారం దత్తత ఇస్తారు.


ఉమ్మడి వరంగల్ జిల్లాలో..


ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2005లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శిశుగృహను ప్రారంభించారు. ఇప్పటివరకు ఈ శిశుగృహ నుంచి దేశీయంగా 196 మంది పిల్లలను, విదేశాలకు 10 మందిని, మొత్తం 206 మంది చిన్నారులను దత్తత ఇచ్చారు. ఇది నిస్సంతాన దంపతులకు, అనాథ చిన్నారులకు ఆశ్రయం కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.


దత్తత ఇచ్చే అధికారం గతంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌కు ఉండేది. ఇప్పుడు ఈ అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు మార్చడం ద్వారా ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. జిల్లా సంక్షేమాధికారిణి జయంతి మాట్లాడుతూ.. శిశువు కావాల్సిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే సీనియారిటీ ప్రకారం అందజేస్తామని తెలిపారు. ఈ చర్యలన్నీ నిస్సంతాన దంపతుల కన్నీళ్లను తుడిచి, వారి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిద్దాం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa