ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రూప్-1 పరీక్షల అవకతవకల ఆరోపణలపై హైకోర్టులో విచారణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 30, 2025, 07:58 PM

తెలంగాణ గ్రూప్-1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయస్థానం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్  అనుసరించిన విధానాలపై పలు కీలక ప్రశ్నలు సంధించింది.విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ, వరుస క్రమంలో హాల్ టికెట్ నంబర్లు కలిగిన కొందరు అభ్యర్థులకు ఒకే విధమైన మార్కులు లభించాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా, నిబంధనల ప్రకారం ప్రొవిజనల్ మార్కుల జాబితాను నిర్ణీత సమయంలో వెల్లడించలేదని, సుమారు 20 రోజుల తర్వాత తుది మార్కులను ప్రకటించారని తెలిపారు. ఈ మధ్యకాలంలో అవకతవకలు జరిగి ఉండవచ్చనే అనుమానాన్ని వారు వ్యక్తం చేశారు.పిటిషనర్ల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, టీజీపీఎస్సీ అనుసరించిన మూల్యాంకన ప్రక్రియ గురించి వివరాలు అడిగి తెలుసుకుంది. ముఖ్యంగా, తెలుగు మాధ్యమంలో పరీక్ష రాసిన అభ్యర్థుల జవాబు పత్రాలను ఎలా మూల్యాంకనం చేశారని ప్రశ్నించింది. "తెలుగులో పరీక్ష రాసిన వారికి తక్కువ మార్కులు వేశారనే ఆందోళన వ్యక్తమవుతోంది. మూల్యాంకనం కోసం జవాబులకు సంబంధించి ఏదైనా 'కీ' పేపర్ ఉంటుందా తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాలకు వేర్వేరుగా 'కీ' ఇచ్చారా" అంటూ టీజీపీఎస్సీని న్యాయస్థానం ప్రశ్నించింది.దీనికి టీజీపీఎస్సీ ప్రతినిధులు స్పందిస్తూ, ఇది రాతపూర్వక పరీక్ష అయినందున మూల్యాంకనం చేసే నిపుణులకు ఎలాంటి 'కీ' పేపర్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. జవాబు పత్రాలను దిద్దిన వారంతా సంబంధిత సబ్జెక్టులలో నిపుణులని, వారి నైపుణ్యం ఆధారంగానే మూల్యాంకనం జరిగిందని కోర్టుకు వివరించారు.అనంతరం, ఈ గ్రూప్-1 పరీక్షలో తెలుగు మాధ్యమంలో ఎంతమంది పరీక్ష రాశారు, వారిలో ఎంతమంది తుది ఎంపిక జాబితాలో ఉన్నారు అనే వివరాలను సమర్పించాలని టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. గతంలో జరిగిన గ్రూప్-1 పరీక్షకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందిస్తామని కమిషన్ కోర్టుకు తెలియజేసింది. రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగులు ఏళ్ల తరబడి గ్రూప్-1 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారని, ఈ నేపథ్యంలో కేసు విచారణను అనవసరంగా ఆలస్యం చేయకుండా త్వరితగతిన ముగించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. తదుపరి విచారణను న్యాయస్థానం గురువారానికి వాయిదా వేసింది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa