సెలైన్ బాటిల్లో పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు కలిపి మత్తు పదార్థం తయారు చేసిన కేసులో టీజీ న్యాబ్, హైదరాబాద్ బాలాపూర్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. మెడికల్ షాప్ ఓనర్ కొద్దిపాటి లాభం ఆశతో నిబంధనలు పాటించకుండా పెయిన్ కిల్లర్ మాత్రలు విక్రయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ వివరాలను టీజీ న్యాబ్, రాచకొండ పోలీసులు మీడియాకు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ బాలాపూర్ మండలం షహీన్ నగర్కు చెందిన సయీద్ సాహిల్ (21) మత్తు కోసం సెలైన్ వాటర్లో పెయిన్ కిల్లర్ మాత్రలు కలిపి వాడటం ప్రారంభించాడు. శంషాబాద్లోని శ్రీనివాస మెడికల్ స్టోర్ యజమాని సిరోమణి జగన్నాథం ప్రవీణ్ (54) నుంచి ఈ ట్యాబ్లెట్లు కొనుగోలు చేస్తున్నాడు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా రూ.39 విలువైన ఒక్కో మాత్రను రూ. ఏడు రూపాయలు అదనంగా రూ.46కి సాహిల్కు విక్రయించాడు.
ఈ మాత్రలను సెలైన్లో కలిపి ఇంజెక్షన్ రూపంలో ఇతరులకు అందించేందుకు సాహిల్.. ఒక్కొక్కరినుంచి రూ.150 వసూలు చేసేవాడు. ఈ నెల 17న సుల్తాన్పూర్కు చెందిన ఓ బాలుడు (17), హఫీజ్బాబానగర్కు చెందిన మరో బాలుడు (17), ఎండీ. ఇంతియాజ్ (22) అనే యువకుడు సాహిల్ వద్ద ఈ మత్తు పదార్థాన్ని తీసుకున్నారు. అధిక మోతాదుతో మత్తు తీసుకోవటంతో వారు అపస్మారక స్థితికి వెళ్లారు. వారిలో ఓ బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో ఇద్దరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సయీద్ సాహిల్, మెడికల్ షాప్ యజమాని జగన్నాథం ప్రవీణ్ను అరెస్టు చేశారు. వీరితో పాటుగా మహ్మద్ అయాన్ (20), జునైద్ ఖాన్ (25) అనే మరో ఇద్దరు యుకకులు సైతం పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని.. మత్తును ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని పోలీసులు చెబుతున్నారు.
కాగా, పలువురు యువత చిన్న వయస్సులోనే మత్తుకు బానిస కావటం ఆందోళనకరమైన విషయం. చదువు, కెరీర్, కుటుంబ సమస్యలు, సామాజిక ఒత్తిడి కారణంగా యువత ఆందోళనకు గురవుతున్నారు. దాని నుంచి ఉపశమనం పొందడానికి మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. స్నేహితుల చెడు ప్రభావం వల్ల లేదా వారిని అనుకరించాలనే ప్రయత్నంలో కొందరు మత్తుకు బానిసలవుతారు. చిన్న వయస్సులో యువత మత్తుకు బానిస కావడం అనేది ఒక సామాజిక సమస్య. దీనిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు కృషి చేయాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa