ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసమానతలకు వ్యతిరేకంగా పోప్ ఫ్రాన్సిస్ అవిశ్రాంతంగా పోరాటం చేశారన్న రేవంత్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 21, 2025, 03:57 PM

రోమన్ క్యాథలిక్ అత్యున్నత మతగురువు పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి ప్రగాఢ విచారం తెలుపుతూ ఘన నివాళులు అర్పించారు. పోప్ ఫ్రాన్సిస్ అందించిన సేవలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్మరించుకున్నారు.సామాజిక న్యాయం కోసం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అసమానతలకు వ్యతిరేకంగా పోప్ ఫ్రాన్సిస్ అవిశ్రాంతంగా పోరాటం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. ప్రపంచ శాంతి స్థాపనలో ఆయన కీలక పాత్ర పోషించారని, ముఖ్యంగా శరణార్థులు, వలసదారులకు అండగా నిలిచిన తీరు అసాధారణమని పేర్కొన్నారు. పోప్ ఫ్రాన్సిస్ కరుణామయ దృక్పథం, అందరినీ కలుపుకొనిపోయే తత్వం ప్రపంచంపై చెరగని ముద్ర వేసిందని అన్నారు.పోప్ ఫ్రాన్సిస్ ఒక గొప్ప ఆధ్యాత్మిక మూర్తి అని, తన జీవితాన్ని పూర్తిగా చర్చికి, మానవాళి సేవకే అంకితం చేశారని సీఎం ప్రశంసించారు. మతాంతర సామరస్యం పెంపొందించడానికి ఆయన ఎంతగానో కట్టుబడి ఉన్నారని, అదేవిధంగా వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విశేష కృషి చేశారని గుర్తుచేశారు. ప్రపంచమంతా ఐక్యతతో ఉండాలనే గొప్ప దార్శనికత పోప్ ఫ్రాన్సిస్ సొంతమని తెలిపారు.పోప్ ఫ్రాన్సిస్ మరణం మానవాళికి తీరని లోటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాథలిక్ సమాజానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa