ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు తీపి కబురు. త్వరలోనే రైల్వేగేట్ల కష్టాలు తొలిగిపోనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో సికింద్రాబాద్-కాజీపేట, బీబీనగర్-నడికుడి రైలు మార్గాల్లో కొత్తగా తొమ్మిది రైల్వే ఓవర్ బ్రిడ్జిల (ఆర్వోబీలు) నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు (మోర్త్) సీఆర్ఐఎఫ్ సేతుబంధన్ పథకం కింద నిధుల కోసం ప్రతిపాదనలు పంపబడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు. కేంద్రం ఆమోదం తెలిపితే, ఏళ్ల తరబడి ఉన్న రైల్వే గేట్ల కష్టాలు త్వరలోనే తొలగిపోనున్నాయి.
ముఖ్యంగా భువనగిరి పాత బస్టాండ్ వద్ద ఉన్న రైల్వే గేటు వల్ల అర్బన్ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైల్వే స్టేషన్ పక్కనే ఉండటంతో తరచూ గేటు వేయడం వల్ల గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. కొన్నిసార్లు గూడ్స్ రైళ్లను గేటు మధ్యలో నిలిపివేయడం కూడా జరుగుతోంది. అలాగే, భువనగిరి శివారులోని మూసుకుంట వద్ద ఉన్న ముత్తిరెడ్డిగూడెం గేటు వల్ల కూడా రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఈ మార్గం భువనగిరి నుండి యాదగిరిగుట్టకు వెళ్లేవారికి దూరం, సమయం తగ్గిస్తుంది.
పగిడిపల్లి- నడికుడి సెక్షన్లో నార్కట్పల్లి- మునుగోడు మధ్య లెవెల్ క్రాసింగ్ 32, ముకుందాపురం- తిప్పర్తి మధ్య లెవెల్ క్రాసింగ్ 56, నల్గొండ ఎఫ్సీఐ గోదాంలు- పెద్దబండ మధ్య లెవెల్ క్రాసింగ్ 45, దామచర్ల మండలం కొండ్రపోల్- వీర్లపాలెం మధ్య లెవెల్ క్రాసింగ్ 86, త్రిపురారం- కుక్కడం మధ్య లెవెల్ క్రాసింగ్ 64 వద్ద ఆర్వోబీలు నిర్మించాలని ప్రతిపాదించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి- పగిడిపల్లి వద్ద సికింద్రాబాద్- కాజీపేట మార్గంలోని లెవెల్ క్రాసింగ్ 30, చౌటుప్పల్- నాగారం మధ్య లెవెల్ క్రాసింగ్ 16, భువనగిరి పాత బస్టాండ్ వద్ద లెవెల్ క్రాసింగ్ 38, ముత్తిరెడ్డిగూడెం గేటు వద్ద లెవెల్ క్రాసింగ్ 31 వద్ద ఆర్వోబీలు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపారు. త్వరలోనే వీటికి గ్రీన్ సిగ్నల్ రానుండగా.. రైల్వే గేటు కష్టాలు తీరనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa