తెలంగాణ రాష్ట్రంలో రాగల రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఆదివారం (ఏప్రిల్ 20) సాయంత్రం హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కూడా పలు చోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్ శాఖ పేర్కొంది.
ఇక రేపు (సోమవారం) కూడా తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది.
ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బలమైన ఈదురు గాలులు, పిడుగుల సమయంలో సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. మరోవైపు కొన్ని జిల్లాల్లో సాధారణం కన్నా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా నిన్న (ఏప్రిల్ 19న) ఆదిలాబాద్లో 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే 3 రోజుల్లో తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా 2- 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa