ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్మితా సబర్వాల్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 18, 2025, 07:58 PM

తెలంగాణలో సర్వత్రా వివాదాస్పదమైన కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఏఐ ఫొటోను రీట్వీట్ చేసిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు తెలంగాణ పోలీసుల నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. పోలీసుల నోటీసులకు స్మితా సబర్వాల్ ఏ మాత్రం వెరవడం లేదు. పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తనదైన శైలిలో.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ట్వీట్లను వరుసగా రీట్వీట్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. కంచ గచ్చిబౌలి భూముల వివాదానికి సంబంధించి పలువురు రాజకీయ నేతలు, ఇతర వ్యక్తులు సోషల్ మీడియాలో చేసిన పోస్టులను డిలీట్ చేస్తున్నప్పటికీ, స్మితా సబర్వాల్ మాత్రం తన ట్వీట్‌ను తొలగించకపోగా.. ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా రీట్వీట్లు చేస్తూ.. తగ్గేదేలే అన్న సంకేతాన్ని ఇస్తున్నారు.


తాజాగా.. "ఒక స్త్రీ తనకోసం నిలబడే ప్రతిసారీ, ఆమె అందరు మహిళల కోసం నిలబడుతుంది.." అంటూ మాయా ఏంజెలో చెప్పిన సందేశాన్ని పోస్ట్ చేస్తూ ఓ మహిళా నెటిజన్ చేసిన ట్వీట్‌ని ఆమె రీట్వీట్ చేశారు. గతంలోనూ.. తాను చేసిన కొన్ని కామెంట్లు, పోస్టులు పెద్ద దుమారమే రేపినా.. ఏమాత్రం వెరవకుండా చివరివరకు తన మాట మీద నిలబడుతూ.. ఎదురైన ప్రతి సందర్భాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు. కాగా.. ఇప్పుడు కంచ గచ్చిబౌలి భూముల విషయంలోనూ స్మితా సబర్వాల్ అదే ఆత్మస్ధైర్యాన్ని కనబరుస్తున్నారు.


కాగా.. కంచె గచ్చిబౌలి వివాదంలో ఏఐ ఫొటోను షేర్ చేసినందుకు గానూ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేయగా.. అదే సందర్భంగా పలు ట్వీట్లను రీపోస్ట్ చేస్తూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. వాటిలో ముఖ్యంగా వంద ఎకరాల భూమిని పునరుద్ధరించాలంటూ సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన ఒక ఫొటో ఉంది. ఈ ఫొటోను రీట్వీట్ చేయడం ద్వారా ఆమె ప్రభుత్వం ఆ ఆదేశాలను పట్టించుకోవడం లేదని పరోక్షంగా విమర్శిస్తున్నట్లు తెలుస్తోంది.


అంతేకాకుండా, మరొక పోస్ట్‌లో "తెలంగాణ పోలీసులు సొంత ఐఏఎస్ అధికారికే నోటీసులు ఇస్తారా? ఇది దేనికి సంకేతం?" అంటూ ఇద్దరు మహిళలు పెట్టిన ట్వీట్‌ను స్మితా సబర్వాల్ రీపోస్ట్ చేశారు. ఈ రీట్వీట్ పోలీసుల చర్యను ప్రశ్నించే విధంగా ఉంది.


ఇదిలా ఉండగా.. ఏఐతో రూపొందించిన బుల్డోజర్లు, నెమళ్లు, జింకలు ఉన్న రెండు పోస్టులను స్మితా సబర్వాల్ గతంలో రీపోస్ట్ చేయడం వివాదాస్పదమైంది. ఈ పోస్టులకు వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ, ఆమె ప్రభుత్వ వ్యతిరేక ట్వీట్లను రీట్వీట్ చేయడం కొనసాగించడంపై ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిణి ప్రభుత్వంతో బహిరంగంగా విభేదించడం, పోలీసుల నోటీసులను సైతం లెక్కచేయకుండా వ్యవహరించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. స్మితా సబర్వాల్ తదుపరి చర్యలు ఎలా ఉండబోతాయో వేచి చూడాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa