ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. సుమారుగా మూడు రోజులుగా కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగింది. చివరకు రెండో ప్రాధాన్యత ఓట్లతో బీజేపీ అభ్యర్థి సి. అంజిరెడ్డి విజయం సాధించారు. 53 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ పూర్తైన తర్వాత బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యంలో నిలిచారు. అంజిరెడ్డికి 78,635 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 73,644 ఓట్లు వచ్చాయి. మరోవైపు ఓటమి ఖరారు కావటంతో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డి కౌంటింగ్ హాల్ నుంచి వెళ్లిపోయారు. అంజిరెడ్డి గెలుపును ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
మరోవైపు కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువ మంది పోటీ చేయడంతో లెక్కింపు నిదానంగా సాగింది. అయితే బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించగా.. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి రెండో స్థానం, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ 63,404 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవటంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించాల్సి వచ్చింది. మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లిన ఓట్లు 2,23,343 కాగా..చెల్లని ఓట్లు 1,11,672 ఓట్లు కావడం గమనార్హం.
ఇక తెలంగాణ ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. ఈ ఎన్నికలో కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి కొమురయ్య గెలుపొందిన సంగతి తెలిసిందే. మొత్తం 25,041 ఓట్లు పోలవ్వగా.. 897 ఓట్లను చెల్లని ఓట్లుగా తేల్చారు. చెల్లుబాటు అయిన 24,144 ఓట్లలో కొమురయ్యకు 12,959 ఓట్లు రాగా.. పీఆర్టీయూ అభ్యర్థి మహేందర్ రెడ్డి 7,182 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. దీంతో టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుని బీజేపీ శ్రేణులు ఫుల్ ఖుషీలో ఉన్నాయి. ఇక నల్గొండ-ఖమ్మం-వరంగల్ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా శ్రీపాల్ రెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఇటీవల ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa