ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్టీసీ బస్సును కూడా వదలని దొంగలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 04, 2025, 06:08 PM

ఇటీవల కాలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. కంటికి ఏది కనిపిస్తే అది దొంగతనం చేసి.. వాటిని వేరే చోట అమ్మేసుకుంటున్నారు. అవి వారికి ఉపయోగపడతాయా..? లేదా అనేది ఆలోచించకుండానే దోచుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లోని దిల్‌సుఖ్ నగర్ బస్టాప్ లో ఓ వింత దొంగతనం చోటు చేసుకుంది. ఆర్టీసీ ప్రయాణంలో టికెట్లు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా తీసుకోవచ్చు. డైరెక్ట్ గా బస్సులో యూపీఐ పేమెంట్ విధానం ద్వారా టికెట్ కొనుగోలు చేసే వెసులుబాటును కల్పించింది ఆర్టీసీ. అయితే టికెట్లను జారీ చేయడానికి ప్రతీ బస్సులో టిమ్ మిషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మిషన్ ద్వారానే టికెట్లను జారీ చేస్తారు.


అయితే దొంగలకు ఈ మిషన్ పై కన్ను పడింది. డ్రైవర్ వాటిని బస్సులో పెట్టి.. కిందకు వెళ్లడం చూశారు. ప్రయాణికుడిలాగా బస్సు ఎక్కిన దొంగలు వాటిని కొట్టేశారు. ఈ ఘటన దిల్ సుఖ్‌నగర్ లోని హైదరాబాద్ 2 డిపోలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. సూర్యాపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ నుండి సూర్యాపేటకు బయలుదేరింది. మార్గ మధ్యలో.. దిల్‌సుఖ్‌నగర్‌లోని హైదరాబాద్ 2 డిపో వద్ద కొద్దిసేపు ఆగింది. ఈ సమయంలో.. బస్సు కండక్టర్ తన టికెట్ మిషన్‌ను సీటుపై ఉంచి.. కంట్రోలర్ చాట్‌లో సంతకం చేయడానికి లోపలికి వెళ్లారు. అయితే.. కండక్టర్ తిరిగి వచ్చేసరికి ఊహించని ఘటన చోటుచేసుకుంది. టిక్కెట్లు జారీ చేసే మిషన్‌తో పాటు అతని మొబైల్ ఫోన్ కూడా అదృశ్యమయ్యాయి.


అసలేం జరిగిందో అర్థంకాక.. కండక్టర్ వెంటనే చుట్టుపక్కల వెతికాడు. ఎక్కడా టిమ్ మిషన్ కానీ.. మొబైల్ ఫోన్ కాని కనిపించలేదు. బస్సులో ఉన్న ప్రయాణికులను ప్రశ్నించినా ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో అతడికి ఏం చేయాలో అర్థం కాక.. తక్షణమే మలక్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. బస్సు నిలిపిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడం ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దొంగతనం ఒకరు చేశారా.. ఒక ముఠాగా ఏర్పడి చేశారా అనేది తెలియాల్సి ఉంది. గతంలో ఇలాంటి ఘటనలు మరికొన్ని చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బస్సు స్టేషన్‌ల వద్ద జాగ్రత్తగా ఉండాలని ఆర్టీసీ అధికారులూ సిబ్బందికి సూచించారు. ఈ ఘటన మరింత మంది ప్రయాణికులకు, ఆర్టీసీ సిబ్బందికి గుణపాఠం కానుంది. భద్రత చర్యలను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa