|
|
by Suryaa Desk | Sun, Apr 26, 2026, 08:46 PM
జాగ్రత్త ప్రజలారా.. డబ్బు, ఆస్తులు సంపాదించడం ఎంత ముఖ్యమో, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంతకంటే ముఖ్యం. ముఖ్యంగా అత్యవసర సందర్భాల్లో లేదా పెళ్లిళ్లు, వేడుకల్లో పేపర్ కప్పుల్లో టీ, కాఫీలు తాగే అలవాటు ఉంటే, అందులో దాగి ఉన్న ప్రమాదాలను తెలుసుకోవడం అవసరం.చాలామంది ప్లాస్టిక్ కప్పుల కంటే పేపర్ కప్పులు సురక్షితం అనుకుంటారు. కానీ వాస్తవానికి పేపర్ కప్పులు కూడా పూర్తిగా సేఫ్ కావని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇవి తడవకుండా ఉండేందుకు లోపలి భాగంలో పలుచని వెక్స్ (Wax)తో పాటు పాలిథిలిన్ ప్లాస్టిక్ పొరను పూతగా వేస్తారు. వేడి టీ లేదా కాఫీని (85°C–90°C) ఈ కప్పుల్లో పోస్తే, ఆ వేడి కారణంగా ప్లాస్టిక్ పొర కరిగి పానీయంలో కలిసే ప్రమాదం ఉంది.దీంతో ప్రతిరోజూ పేపర్ కప్పుల్లో వేడి పానీయాలు తీసుకునే వారు గమనించకుండా మైక్రోప్లాస్టిక్ కణాలను శరీరంలోకి తీసుకుంటున్నారు. రోజుకు మూడుసార్లు ఇలా తాగితే, సుమారు 75,000 వరకు సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు శరీరంలోకి చేరవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఇవి రక్తంలో కలసి శరీరంలోని వివిధ అవయవాల్లో పేరుకుపోయి, కాలక్రమేణా జీర్ణ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, అలాగే వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది.అదేవిధంగా, పేపర్ కప్పుల తయారీలో ఉపయోగించే ఫ్లోరిన్ వంటి రసాయనాలు కాలేయం (Liver), కిడ్నీలపై దుష్ప్రభావం చూపవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రమాదాల నుండి దూరంగా ఉండాలంటే చిన్నచిన్న మార్పులు చేసుకోవడం అవసరం. బయట టీ తాగేటప్పుడు వీలైతే స్టీల్ గ్లాస్ వెంట తీసుకెళ్లడం మంచిది. అలాగే ఆఫీసుల్లో పింగాణీ లేదా గాజు కప్పులను ఉపయోగించడం ఆరోగ్యకరం. సంప్రదాయ మట్టి కప్పులు (కుల్హడ్) ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది.
Latest News