|
|
by Suryaa Desk | Thu, Mar 26, 2026, 10:21 PM
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శౌర్య పురస్కార గ్రహీతలకు తీపికబురు అందిస్తూ ఒక ముఖ్య ప్రకటన చేసింది. దేశ రక్షణలో విశేష సేవలందించిన సైనికులను గౌరవించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.ఇక నుంచి ఈ పురస్కారాలను పొందిన వారికి జీవితాంతం ఉచిత రైలు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సదుపాయం వారి కుటుంబ సభ్యులకు కూడా వర్తించనుంది. ఈ నిర్ణయానికి సంబంధించి నిబంధనలను ప్రభుత్వం అధికారికంగా నోటిఫై చేసింది.
*రైళ్లలో జీవితాంతం ఉచిత ప్రయాణం :శౌర్య పురస్కార గ్రహీతలు దేశంలో ఎక్కడినుంచి ఎక్కడికైనా ఉచితంగా రైళ్లలో ప్రయాణించే అవకాశం పొందుతారు. ఒకవేళ పురస్కార గ్రహీత మరణిస్తే, ఈ సౌకర్యం జీవిత భాగస్వామికి కొనసాగుతుంది. అయితే జీవిత భాగస్వామి తిరిగి వివాహం చేసుకుంటే ఈ ప్రయోజనం వర్తించదు.పెళ్లి కాని సైనికుడు మరణానంతరం పురస్కారం పొందిన సందర్భంలో, అతని తల్లిదండ్రులకు మరియు వారితో పాటు ఒక సహాయకుడికి కూడా ఉచిత రైలు ప్రయాణం కల్పిస్తారు. ఫస్ట్ క్లాస్, సెకండ్ ఏసీ, ఏసీ చైర్ కార్ వంటి కోచ్లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.సైనికుల కుటుంబాలకు గౌరవప్రదమైన స్థానం కల్పిస్తూ, వారికి సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నిబంధనలు త్వరలోనే అమల్లోకి రానున్నాయి.
*రైల్వే ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్ : ఇదిలా ఉండగా, మాజీ అగ్నివీర్లు మరియు రిటైర్డ్ సైనికులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు రైల్వేశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రైల్వే ఉద్యోగాలపై అవగాహన కల్పిస్తూ, వారికి సహాయపడే విధంగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది.ఈ క్రమంలో లెవల్-2 మరియు అంతకంటే పై స్థాయి పోస్టుల్లో 10 శాతం, లెవల్-1 పోస్టుల్లో 20 శాతం రిజర్వేషన్ను కల్పిస్తోంది. 2024, 2025 సంవత్సరాల్లో మాజీ సైనికుల కోసం మొత్తం 14,788 ఖాళీలను భర్తీ చేసినట్లు సమాచారం. అందులో లెవల్-1లో 6,848, లెవల్-2లో 8,303 పోస్టులు ఉన్నాయి.ఈ నియామకాలను రైల్వే రిక్రూట్మెంట్ సెల్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు నిర్వహిస్తున్నాయి. కాగా సైన్యంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి వీర చక్ర, మహావీర చక్ర, అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర వంటి గౌరవ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేస్తోంది.