|
|
by Suryaa Desk | Fri, Mar 20, 2026, 08:33 PM
Jazeera Airways: ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో కువైట్-ఇండియా మధ్య విమాన సర్వీసులపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జజీరా ఎయిర్వేస్కు ప్రత్యేక అనుమతి మంజూరు చేసి ఇరు దేశాల మధ్య విమానాల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.దీంతో కువైట్-ఇండియా మధ్య జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు త్వరలోనే తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రాంతీయ వైమానిక మార్గాల మూసివేతతో ఏర్పడిన ప్రయాణ ఇబ్బందులను తగ్గించడమే ఈ నిర్ణయం లక్ష్యమని కువైట్లోని భారత రాయబారి పరమితా త్రిపాఠి వెల్లడించారు.గురువారం సాయంత్రం భారత రాయబార కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె, ఇరాన్ యుద్ధం కారణంగా 2026 ఫిబ్రవరి 28 నుంచి కువైట్ వైమానిక మార్గాలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయని తెలిపారు. దీంతో అత్యవసరంగా భారత్కు రావాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం నిరంతరం సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతూ సహాయక చర్యలు చేపడుతోంది. అత్యవసర ప్రయాణం అవసరమైన వారికి సౌదీ అరేబియా విమానాశ్రయాల ద్వారా ట్రాన్సిట్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో రియాద్లోని భారత రాయబార కార్యాలయం, సౌదీ ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ ఇప్పటివరకు 1,100 మందికి పైగా భారతీయులకు ట్రాన్సిట్ వీసాలు పొందేలా సహకరించిందని తెలిపారు.మానవతా దృక్పథంతో, మరణించిన వారి మృతదేహాలను భారత్కు తరలించే ప్రక్రియలో కూడా కువైట్ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఇప్పటివరకు 17 మృతదేహాలను స్వదేశానికి పంపించినట్లు, ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయగలిగామని త్రిపాఠి తెలిపారు.
Latest News