|
|
by Suryaa Desk | Sun, Mar 15, 2026, 07:29 PM
పుదుచ్చేరితో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదివారం సాయంత్రం విడుదల చేసింది. కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరిలో ఒకే విడత.. అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైన పశ్చిమ్ బెంగాల్లో రెండు దశల్లోనూ పోలింగ్ జరగనుంది. అయితే, కిందట ఎన్నికల్లో అక్కడ 8 దశల్లో పోలింగ్ నిర్వహించగా.. ఈసారి మాత్రం రెండు దశల్లో నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. 2021లో బెంగాల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. మార్చిలో మొదటి విడత జరిగితే.. చివరి విడత ఏప్రిల్ 29న ముగిసింది. ఈ సారి మాత్రం 294 సీట్లకుగానూ.. ఏప్రిల్ 23న 152, ఏప్రిల్ 29న 142 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నట్టు ఈసీ తెలిపింది.
బెంగాల్లో పోలింగ్ దశల సంఖ్యను తగ్గించడంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందిస్తూ... ‘సౌలభ్యం’ అనే అంశాన్ని ప్రస్తావించింది. ‘అందరి సౌలభ్యం కోసమే ఎన్నికల దశల సంఖ్యను రెండుకు తగ్గించాం’ అని ఈసీ పేర్కొంది. ఇటీవల బెంగాల్లో పర్యటించిన ఎన్నికల పరిశీలకులను కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు.. పోలింగ్ దశలను కుదించాలని విజ్ఞప్తి చేశాయి.
పలు దశల్లో ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రచార సమయం ఎక్కువ అవుతుందని రాజకీయ నాయకులు వాదిస్తున్నారు. ఈ ప్రక్రియకు ఖర్చుతో పాటు భౌతిక శ్రమ కూడా ఎక్కువేనని వారు వివరించారు. సుదీర్ఘకాలం ఎన్నికల ప్రక్రియ ఆర్థికంగా భారంగా మార్చడమే కాదు, ప్రక్రియను ప్రభావితం చేస్తాయని ఈసీ పరిశీలకులకు పార్టీల నాయకులు తెలియజేశారు. దీంతో వారి ఆందోళనలను ఈసీ పరిగణనలోకి తీసుకుని, ఎన్నికల షెడ్యూల్ను కుదించింది.
ఇక, చారిత్రకంగా తీవ్ర రాజకీయ యుద్ధాన్ని చూసిన పశ్చిమ బెంగాల్లో పోలింగ్ షెడ్యూల్ను నిర్ణయించడంలో భద్రత కూడా ఒక ప్రధాన అంశం. ఎన్నికలకు సన్నాహకంగా దాదాపు 480 బెటాలియన్ల కేంద్ర బలగాలను ఇప్పటికే ఆ రాష్ట్రానికి పంపినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడటం, శాంతిభద్రతలను కాపాడటం కేంద్ర బలగాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. గత ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకున్న బీజేపీ.. ఈసారి బెంగాల్ కోటలో కాషాయ జెండా ఎగురవేయాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది.
Latest News