|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 10:25 PM
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు.. మొజ్తబా ఖమేనీ ఆదేశ నూతన సుప్రీం లీడర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా అమెరికా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సహా ఆ దేశ కీలక భద్రతా అధికారుల సమాచారం అందించిన వారికి భారీగా నజరానా ప్రకటించింది. ముఖ్యంగా వారి తలలపై 10 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.92 కోట్లు) రివార్డును ప్రకటించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ తన రివార్డ్స్ ఫర్ జస్టిస్ ప్రోగ్రామ్ ద్వారా శనివారం ఒక బహిరంగ ప్రకటన విడుదల చేసింది.
ఫిబ్రవరి 28వ తేదీన యుద్ధం ప్రారంభమైన తొలి దశలో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఆయన స్థానంలోకి ఖమేనీ కుమారుడు మొజ్తబా రాగా.. అమెరికా ఇప్పుడు ఆయన్ను ఉగ్రవాద ముఠా నాయకుడిగా అభివర్ణిస్తోంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రణాళికలు రచిస్తూ.. దాడులను అమలు చేస్తున్న ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ను వీరే వెనుక ఉండి నడిపిస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది. అందుకే వీరి ఆచూకీ తెలిపిన వారికి భారీ నజరానాతో పాటు అవసరమైతే ఇతర దేశాలకు తరలించే బాధ్యతను కూడా తామే తీసుకుంటామని వాషింగ్టన్ హామీ ఇచ్చింది.
హిట్ లిస్ట్లో ఉన్న ఇతర ముఖ్య నేతలు..
కేవలం మొజ్తబా మాత్రమే కాకుండా ఇరాన్ రక్షణ, నిఘా వ్యవస్థల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఐదుగురు అగ్ర నేతల పేర్లను కూడా అమెరికా తన జాబితాలో చేర్చింది. వారిలో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఎస్మాయిల్ ఖతీబ్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అలీ అస్ఘర్ హెజాజీ, మేజర్ జనరల్ యాహ్యా రహీమ్ సఫావీ, ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఎస్కాందర్ మోమేని, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీలు ఉన్నారు. వీరంతా ఐఆర్జీసీతో కలిసి అంతర్జాతీయంగా అలజడి సృష్టిస్తున్నారని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
రహస్య మార్గాల ద్వారా సమాచారం..
ఈ సమాచారాన్ని అందించాలనుకునే వారు ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్ఫారమ్లు లేదా అత్యంత సురక్షితమైన 'టోర్' నెట్వర్క్ ద్వారా సంప్రదించాలని అధికారులు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. చూడాలి మరి అమెరికా ఇచ్చిన ఆ ఆఫర్ను ఎవరైనా ఉపయోగించుకుని.. ఇరాన్ అగ్రనేతల సమాచారం అందిస్తారా లేదా అనేది.
Latest News