|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 09:11 PM
జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రైవేట్ వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలను సవరించడంకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం ఈ వార్షిక పాస్ ధర రూ. 3,000గా ఉంది. అయితే ఏప్రిల్ 1, 2026 నుంచి దీని ధర 2.5 శాతం పెరిగి రూ. 3,075 అవుతుంది. రహదారుల నిర్వహణ, టోల్ రేట్ల వార్షిక సమీక్షలో భాగంగా ఈ పెంపును చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఇప్పటికీ పాత ధరకే పాస్ పొందాలనుకుంటే వాహనదారులు మార్చి 31లోపు రీఛార్జ్ చేసుకోవాలని సూచించారు.ఈ వార్షిక పాస్ కేవలం ప్రైవేట్ (నాన్-కమర్షియల్) వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. పాస్ ఒక సంవత్సరం కాలపరిమితి కోసం చెల్లుబాటు అవుతుంది లేదా గరిష్టంగా 200 టోల్ ప్లాజాల వరకు ఉపయోగించవచ్చు. అంటే ఏడాది పూర్తికాక ముందే 200 టోల్ ప్లాజాలను దాటితే, పాస్ గడువు ముగిసినట్లే పరిగణించబడుతుంది. టోల్ గేట్ల వద్ద ఆగకుండా, ఎలాంటి అదనపు చెల్లింపులు లేకుండా ప్రయాణించడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆగస్టు 15 నుంచి ఈ పథకం ద్వారా దాదాపు 52 లక్షల వాహనదారులు ఉపయోగించుకుంటున్నారు.
*పాస్ పొందడం ఎలా? మీ వాహనానికి యాక్టివ్ ఫాస్టాగ్ ఉంటే, యాన్యువల్ పాస్ పొందడం చాలా సులభం. ముందుగా NHAI అధికారిక పోర్టల్ లేదా మీ ఫాస్టాగ్ ఇచ్చిన బ్యాంక్ యాప్ లో లాగిన్ అవ్వండి. అక్కడ ‘యాన్యువల్ పాస్’ ఆప్షన్ ఎంచుకుని, ఆన్లైన్ పేమెంట్ ద్వారా ఫీజును చెల్లించండి. చెల్లింపు పూర్తయిన వెంటనే, పాస్ మీ ఫాస్టాగ్ ఖాతాకు లింక్ అవుతుంది.ప్రభుత్వం సూచించినట్లుగా, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాలకు ఏప్రిల్ 1 నుంచి కొత్త రేట్లు అమలు కాబోతున్నాయి. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి, వీలైనంత త్వరగా రీఛార్జ్ చేసుకోవడం ద్వారా అదనపు ఖర్చులను తగ్గించుకోవచ్చు.