ఇరాక్ ఓడ దాడిలో ముంబై ఇంజినీర్ మృతి
 

by Suryaa Desk | Sat, Mar 14, 2026, 08:09 PM

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు ఒక భారతీయ మధ్యతరగతి కుటుంబంలో తీరని శోకాన్ని నింపాయి. తన పదవికి రాజీనామా చేసినప్పటికీ.. కుమార్తె మెడికల్ కాలేజీ ఫీజుల కోసం చివరసారిగా సముద్ర ప్రయాణానికి వెళ్లాడో ఇంజినీర్. అదే అతని పాలిట శాపంగా మారింది. ముఖ్యంగా ఇరాక్ సమీపంలో జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. కుమార్తె జీవితం కోసం ఆయన చేసిన త్యాగం.. ఇప్పుడు ఆ కుటుంబాన్ని నిద్రపోనీయకుండా చేస్తోంది. ఆపూర్తి వివరాలు మీకోసం.


అసలేం జరిగిందంటే..?


ముంబైలోని కాండివిలి ఈస్ట్‌లో నివసించే 56 ఏళ్ల ఇంజినీర్ దేవో నందన్ ప్రసాద్ సింగ్.. ఎంటీ సేఫ్‌సీ విష్ణు అనే ఆయిల్ ట్యాంకర్‌పై అదనపు చీఫ్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. అయితే బుధవారం రోజు ఈ ఓడ ఇరాక్‌లోని బస్రా సమీపంలో ఉన్న ఖోర్ అల్ జుబైర్ పోర్టుకు చేరువలో ఉండగా భీకర దాడికి గురైన విషయం అందరికీ తెలిసిందే. ఈ దాడిలోనే దేవో నందన్ ప్రసాద్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. అయితే చనిపోవడానికి కాసేపటి ముందు అంటే.. దాడి జరిగిన రోజు రాత్రి 2.36 గంటలకు ఆయన చివరిసారిగా తన కుటుంబానికి ఫోన్ చేశారు.


షిప్‌లో మంటలు చెలరేగుతున్నాయి.." అని భయాందోళనతో చెప్పిన ఆ మాటలే ఆయన నోటి నుంచి వచ్చిన ఆఖరి మాటలు అయ్యాయి. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఎన్ని సార్లు ఫోన్ చేసినా అవతలి నుంచి స్పందన లేదు. అయితే నాగ్‌పూర్ మెడికల్ కాలేజీలో చదువుతున్న ఆయన కుమార్తె కోమల్ సింగ్ మాట్లాడుతూ.. "నా కాలేజీ ఫీజులు పెండింగ్‌లో ఉన్నాయని.. ఆ డబ్బు కోసం నాన్న రిజైన్ చేసినా కూడా ఈ ఒక్క ట్రిప్ వెళ్తానన్నారు. ఇప్పుడు ఆయన లేరనే వార్తను మేం నమ్మలేకపోతున్నాం" అంటూ కన్నీరుమున్నీరు అయ్యారు.


కంపెనీ తీరుపై కుటుంబ సభ్యుల ఆగ్రహం


తమకు కంపెనీ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని సింగ్ భార్య కుంకుమ్ సింగ్ ఆరోపించారు. మొదట అందరూ సురక్షితంగా ఉన్నారని చెప్పిన షిప్పింగ్ కంపెనీ.. తీరిగ్గా ఆయన మరణించారని చెప్పడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సముద్రపు నీటిని ఎక్కువగా పీల్చుకోవడం వల్లే ఆయన చనిపోయారని కంపెనీ చెబుతున్నప్పటికీ.. దీనిపై అంతర్జాతీయ స్థాయిలో విచారణ జరపాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.


అంతేకాకుండా ఆయన భౌతిక కాయాన్ని తక్షణమే గౌరవప్రదంగా స్వదేశానికి తీసుకురావాలని కోరుతున్నారు. పిల్లల చదువుకు ఆసరాగా నిలవాల్సిన వ్యక్తిని కోల్పోయినందుకు తగిన నష్టపరిహారం అందజేయాలని అంటున్నారు. యుద్ధం లేని ప్రాంతంలో కూడా పౌర నౌకలపై దాడులు ఎలా జరుగుతున్నాయో ప్రపంచ దేశాలు నిలదీయాలని దేవో నందన్ ప్రసాద్ సింగ్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అమెరికాలో మేనేజ్‌మెంట్ కోర్సు చేస్తున్న ఆయన కుమారుడు తండ్రి మరణవార్త విని హుటాహుటిన భారత్‌కు బయలుదేరారు.

Latest News
Palaniswami to relaunch AIADMK campaign tomorrow as TN poll battle heats up Tue, Mar 24, 2026, 05:00 PM
Karnataka: Oppn slam state govt for Rs 10 crore aid to Wayanad landslide victims ​ Tue, Mar 24, 2026, 04:54 PM
Digital transformation emerges as new engine for sustainable development in Asia: Report Tue, Mar 24, 2026, 04:48 PM
Rights body flags Pakistan's 'inhumane policy' of collective punishment in Balochistan Tue, Mar 24, 2026, 04:37 PM
'Made in India ships in the works, Rs 70,000 crore earmarked': PM Modi pitches for 'atmanirbharta' in global trade Tue, Mar 24, 2026, 04:23 PM