|
|
by Suryaa Desk | Thu, Mar 12, 2026, 08:24 PM
దేశంలో నెలకొన్న వంటగ్యాస్ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో గృహ వినియోగదారులకు ఎల్పీజీ సిలిండర్ రీఫిల్ బుకింగ్ మధ్య వ్యవధిని 45 రోజులకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణ, నగర ప్రాంతాల్లో మాత్రం 25 రోజుల నిబంధన కొనసాగుతుందని స్పష్టం చేసింది.ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రెండు సిలిండర్ల బుకింగ్ మధ్య 25 రోజుల గ్యాప్ ఉండగా, ఇకపై ఈ నిబంధన కేవలం పట్టణ, నగర ప్రాంతాలకే పరిమితం కానుంది. గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు మాత్రం ఒక సిలిండర్ బుక్ చేశాక, తదుపరి సిలిండర్ బుకింగ్ కోసం 45 రోజులు ఆగాల్సి ఉంటుంది.ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఎల్పీజీ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో దేశంలో గ్యాస్ కొరత తీవ్రమైంది. దీంతో చాలామంది వినియోగదారులు ముందుజాగ్రత్తగా సిలిండర్లను బ్లాక్లో నిల్వ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో హైదరాబాద్ సహా పలు నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి డిమాండ్ పెరగడంతో కమర్షియల్ సిలిండర్లను ఏజెన్సీలు రెట్టింపు ధరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.కాగా, గ్రామీణ ప్రాంతాల్లో సరఫరా వ్యవస్థను క్రమబద్ధీకరించి, అందరికీ గ్యాస్ అందుబాటులో ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. గ్యాస్ ఉత్పత్తిని పెంచినప్పటికీ, డిమాండ్ను నియంత్రించే చర్యల్లో భాగంగానే ఈ కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చినట్లు తెలుస్తోంది.
Latest News