|
|
by Suryaa Desk | Thu, Mar 12, 2026, 06:10 PM
తమ తమ శాఖలో ఫైళ్ల క్లియరెన్స్ను ఆధారంగా చేసుకుని.. మంత్రులకు రేటింగ్లు ఇస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశం తొలి రోజున మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆయా శాఖల్లో ఫైళ్ల క్లియరెన్స్ ఎంత వేగంగా జరుగుతోందనే అంశంపై సీఎం చంద్రబాబు అందరు మంత్రులకు రేటింగ్స్ ప్రకటించారు. సీఎం చంద్రబాబు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫైళ్ల క్లియరెన్స్ అంశంలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అగ్ర స్థానంలో నిలిచారు. అచ్చెన్నాయుడు తర్వాతి స్థానాల్లో వరుసగా నిమ్మల రామానాయుడు, కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాలుగో స్థానంలో ఉండడం గమనార్హం.
ఇక ఈ మంత్రుల పనితీరుకు సంబంధించిన రేటింగ్స్లో హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత చిట్టచివరి స్థానంలో ఉన్నట్లు చంద్రబాబు లెక్కల ప్రకారం తెలిసింది. ఈ సందర్భంగా తమ శాఖలోని ఫైళ్లను క్లియర్ చేసేందుకు మంత్రులు ఎంత సమయం తీసుకుంటున్నారో వివరంగా వెల్లడించిన సీఎం చంద్రబాబు.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులు, తీసుకున్న నిర్ణయాలు వేగంగా పూర్తి అయ్యేలా త్వరగా ఫైళ్లను క్లియరెన్స్ చేయాలని ఈ సందర్భంగా మంత్రులకు సూచించారు. పాలనలో వేగం పెంచడం ద్వారా.. రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన వెల్లడించారు.
మరోవైపు.. సచివాలయంలో కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశం రెండో రోజు కూడా జరగనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖపై ప్రత్యేక ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అలాగే ఆదాయార్జనకు సంబంధించిన శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర విద్యా రంగం, రాష్ట్రంలో ఉపాధి అవకాశాలపై కూడా ఈ కలెక్టర్ల సమావేశంలో చర్చించనున్నారు. కోర్టు్ల్లో ఉన్న కేసులు, న్యాయ శాఖ పరిధిలో ఉన్న అంశాలపైనా అధికారులు సీఎంకు వివరాలు అందించనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు ప్రత్యేక సమీక్ష చేయనున్నారు. ఈ సమీక్ష కలెక్టర్లు, ఎస్పీలతో కలిసి జరగనుండగా.. ఏపీలో చట్టాన్ని మరింత బలోపేతం చేసే విషయాలపై చర్చ జరపనున్నారు.
Latest News