|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 07:11 PM
వింత ఘటనలు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ జరుగుతుంటాయి. సుమారు ఏడేళ్ల క్రితం నమోదైన ఒక సంచలన కేసులో ఉత్తర ప్రదేశ్లోని ఒక ప్రత్యేక కోర్టు అనూహ్య తీర్పును ఇచ్చింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ తన బావపై ఫిర్యాదు చేసిన ఒక బాలిక.. తాజాగా జరిగిన విచారణలో షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ముఖ్యంగా తనపై అత్యాచారం జరిగింది నిజ జీవితంలో కాదని.. అదంతా కలలో సాగిందని పేర్కొనడంతో కేసు ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఈ వాంగ్మూలం ఆధారంగా భారత వైమానిక దళానికి చెందిన అనురాగ్ శుక్లాను కోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ కేసును కొట్టివేసింది.
2019 మార్చి 8వ తేదీన కాన్పూర్లోని నౌబస్తా ప్రాంతంలో ఉన్న తన అక్క ఇంటికి వెళ్లిందో 15 ఏళ్ల బాలిక. అయితే అదే రోజు రాత్రి తన బావ అనురాగ్ శుక్లా తనపై అఘాయిత్యానికి ప్రయత్నించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి తండ్రి, అక్క (నిందితుడి భార్య) కూడా ఇదే నిజమని చెప్పారు. దీంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. 2019 సెప్టెంబర్లో అనురాగ్ను అరెస్ట్ చేశారు. ఆయన సుమారు 19 రోజుల పాటు జైలులో గడిపి.. అక్టోబర్లో బెయిల్పై విడుదల అయ్యారు.
ఈ కేసు విచారణలో భాగంగా మైనర్ బాలిక న్యాయమూర్తి ముందు హాజరై సంచలన విషయాలు వెల్లడించింది. ఆరోజు రాత్రి తాను యాంటీబయాటిక్ మందులు వేసుకోవడం వల్ల సగం స్పృహలో మాత్రమే ఉన్నానని.. ఆ సమయంలో తన బావ తనను తాకినట్లు కలలో అనిపించిందని పేర్కొంది. ఆ కల వల్ల ఒక్కసారిగా భయాందోళనకు గురై కేకలు వేశానని.. దానిని అందరూ నిజమని పొరబడ్డారని వివరించింది. అంతేకాకుండా బాలిక తండ్రి, నిందితుడి భార్య (బాలిక అక్క) కూడా కోర్టులో సాక్ష్యం చెబుతూ.. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఒక పెద్ద అపార్థం వల్లే ఈ ఫిర్యాదు చేశామని అంగీకరించారు.
కోర్టు నిందితుడిని నిర్దోషిగా తేల్చినప్పటికీ.. ఈ కేసు అనురాగ్ శుక్లా జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది. నిర్దోషిగా బయటపడిన తర్వాత ఆయన స్పందిస్తూ.. ఈ తప్పుడు ఆరోపణల వల్ల తన కుటుంబ పరువు, తన గౌరవం మంటలో కలిశాయని ఆవేదన చెందాడు. అలాగే వైమానిక దళంలో తన వృత్తిపరమైన ఎదుగుదల కూడా ఆగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశాడు. 2020లో తనకు రావాల్సిన 'కార్పోరల్' హోదా ప్రమోషన్ ఈ కేసు కారణంగానే నిలిచిపోయిందని.. ఇప్పటికీ తాను లీడింగ్ ఎయిర్క్రాఫ్ట్మన్గానే కొనసాగుతున్నానని పేర్కొన్నాడు.
Latest News