|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 03:24 PM
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో కేసు దర్యాప్తు ప్రక్రియ ముగిసిందని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. ధర్మాసనం ఈ కేసుపై స్పందిస్తూ, విచారణను వేగవంతం చేయాలని ట్రయల్ కోర్టుకు స్పష్టమైన గడువు విధించింది.సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాది కీలక ప్రకటన చేశారు. ఈ కేసులో ఇప్పటికే మూడవ సప్లిమెంటరీ (అదనపు) ఛార్జిషీట్ను దాఖలు చేశామని, దీంతో తమ వైపు నుంచి దర్యాప్తు ప్రక్రియ పూర్తయిందని న్యాయస్థానానికి వివరించారు. దర్యాప్తు ముగిసిన నేపథ్యంలో, నిందితుల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ గతంలో సీబీఐ, వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ అవసరం లేదని భావించిన ధర్మాసనం, వాటిని డిస్మిస్ చేసింది.అయితే, తాము లేవనెత్తిన కొన్ని కీలక అంశాలపై సీబీఐ సరైన దర్యాప్తు చేయలేదని సునీత తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం... కేసులోని అంశాలు లేదా ఆధారాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే నేరుగా ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని సూచించింది. సెక్షన్ 207 కింద ట్రయల్ కోర్టులో దాఖలైన అన్ని పిటిషన్లను పరిశీలించి, విచారణను పూర్తి చేయాలని ఆదేశించింది.
Latest News