|
|
by Suryaa Desk | Tue, Mar 10, 2026, 10:29 PM
ప్రస్తుతం ఏటీఎంల నుంచి ఎక్కువగా రూ.500, రూ.200, రూ.100 నోట్లు మాత్రమే లభిస్తున్నాయి. ముఖ్యంగా రూ.500 నోట్లు ఎక్కువగా వస్తుండటం వల్ల ప్రజలు చిన్న చిల్లర కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు ఏటీఎంల నుంచి పెద్ద విలువ గల నోట్లు మాత్రమే విత్డ్రా చేసుకునే అవకాశం ఉండగా, చిన్న నోట్లను తీసుకునే సదుపాయం అందుబాటులో లేదు.అయితే త్వరలో ఈ పరిస్థితి మారనుంది. ఇకపై ఏటీఎంల నుంచి రూ.10, రూ.20, రూ.50 వంటి చిన్న నోట్లను కూడా ఉపసంహరించుకునే అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానాన్ని అమలు చేయడానికి ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించినట్లు రాజ్యసభలో కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. సాంప్రదాయ ఏటీఎంల నుంచే చిన్న విలువ గల నోట్లను పంపిణీ చేసే విధానాన్ని పరీక్షిస్తున్నట్లు చెప్పారు. దేశంలో చిన్న నోట్ల కొరత లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ.. రూ.10, రూ.20, రూ.50 నోట్లు దేశంలో తగినంతగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఏటీఎంల నుంచి ఎక్కువగా రూ.500, రూ.200, రూ.100 నోట్లు రావడం వల్ల కొనుగోళ్ల సమయంలో చిల్లర సమస్య తలెత్తుతుందని చెప్పారు. ప్రజలు ఎక్కువగా ఆన్లైన్ చెల్లింపులు చేయడం వల్ల కూడా చిన్న నోట్ల వినియోగం తగ్గిందని పేర్కొన్నారు. ఈ సమస్యకు పరిష్కారం కోసం ఏటీఎంలలో చిన్న నోట్లను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు.చిల్లర సమస్యను తగ్గించేందుకు ప్రత్యేకంగా చిన్న విలువ గల కరెన్సీ డిస్పెన్సర్లను పరీక్షిస్తున్నామని, ఇవి అమల్లోకి వస్తే ప్రజలు ఏటీఎంల నుంచి నేరుగా చిన్న నోట్లను విత్డ్రా చేసుకోవచ్చని ఆయన తెలిపారు. దీంతో అవసరమైనప్పుడు చిల్లర కోసం తిరగాల్సిన ఇబ్బంది తగ్గుతుందని పేర్కొన్నారు.ఇక దేశంలో చిన్న కరెన్సీ నోట్ల లభ్యతపై కూడా ప్రభుత్వం వివరాలు వెల్లడించింది. ఫిబ్రవరి 26 నాటికి కేంద్ర బ్యాంక్ రూ.10 నోట్లు సుమారు 439.4 కోట్ల విలువకు, రూ.20 నోట్లు 193.7 కోట్ల విలువకు, రూ.50 నోట్లు 130 కోట్ల విలువకు సరఫరా చేసినట్లు తెలిపింది. అంతేకాకుండా గత ఆర్థిక సంవత్సరంలో రూ.10 నోట్లు 180 కోట్లు, రూ.20 నోట్లు 150 కోట్లు, రూ.50 నోట్లు 300 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించింది.దేశంలో వివిధ విలువల కరెన్సీ నోట్లకు ఉన్న డిమాండ్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరచూ సమీక్షిస్తూ, అవసరమైన మేరకు కొత్త నోట్లు ముద్రించేందుకు సిఫార్సులు చేస్తుందని ప్రభుత్వం తెలిపింది.
Latest News