|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 09:23 PM
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టును 96 పరుగుల భారీ తేడాతో ఓడించి భారత జట్టు ప్రపంచకప్ ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది.ఈ ఘన విజయంపై క్రికెట్ దిగ్గజాలు ప్రశంసలు కురిపించాయి. సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి మాజీ, ప్రస్తుత క్రికెటర్లు టీమిండియాకు అభినందనలు తెలియజేశారు.వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కోచ్ గౌతమ్ గంభీర్ ముఖంలో కనిపించిన చిరునవ్వు ఎంతో ఆకర్షణీయంగా ఉందని మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేర్కొన్నారు. గెలుపు కోసం ఉన్న పట్టుదలతో పాటు చిరునవ్వు కూడా ఉండటం నిజమైన “కిల్లర్ కాంబినేషన్” అని ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఛాంపియన్ బౌలర్ అంటే గుర్తొచ్చే పేరు జస్ప్రీత్ బుమ్రానే అని ధోనీ ప్రశంసించారు.టి20 ఫార్మాట్లో ఒకే జట్టు వరుసగా రెండుసార్లు వరల్డ్ కప్ గెలుచుకోవడం గొప్ప విజయమని సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డారు. సాధారణంగా టి20 మ్యాచ్లలో 20 నుంచి 30 పరుగుల తేడాతో గెలిచినా అది పెద్ద విజయం అని భావిస్తారని, అలాంటిది ఫైనల్లో 96 పరుగుల తేడాతో గెలవడం నిజంగా విశేషమని సునీల్ గావస్కర్ పేర్కొన్నారు.ఈ టోర్నమెంట్ మొత్తం సంజు శాంసన్ అద్భుత ప్రదర్శన కనబరిచారని విరాట్ కోహ్లీ ప్రశంసించారు. టీమిండియాలో ఉన్న ప్రతిభావంతులైన ఆటగాళ్లతో ఇతర జట్లు సరితూగడం చాలా కష్టమని ఆయన అన్నారు.భారత బ్యాటింగ్ శైలిపై స్పందించిన వీరేంద్ర సెహ్వాగ్, ఆటగాళ్లు గల్లీ క్రికెట్ ఆడినంత సులభంగా బ్యాటింగ్ చేశారని కొనియాడారు. అలాగే టీ20 ప్రపంచకప్ను మూడుసార్లు గెలుచుకోవడం భారత క్రికెట్ చరిత్రలో గొప్ప ఘట్టమని పేర్కొన్నారు.
Latest News