|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 07:32 PM
పశ్చిమాసియాలో యుద్ధం రోజు రోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఇరాన్పై గత రెండు రోజుల నుంచి ఇజ్రాయెల్ దాడులను మరింత ఉద్ధృతం చేసింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ చేసిన ఓ పని అమెరికాను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఇరాన్ చమురు క్షేత్రాలను టార్గెట్ చేయడంపై అగ్రరాజ్యం తీవ్రంగా స్పందించినట్టు అంతర్జాతీయ మీడియా నివేదించింది. దీనిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు వైట్హౌస్ అధికారులు అమెరికా మీడియా ఆక్సియోస్ నివేదిక తెలిపింది. ఇరాన్ ఆయిల్ నిల్వ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడుల తీవ్రతను చూసి అమెరికా అధికారులు ఆశ్చర్యపోయారని పేర్కొంది. ఇరాన్- ఇజ్రాయెల్ భీకర దాడులతో పశ్చిమాసియాలో దారుణ పరిస్థితులు నెలకున్నాయి.
దాడుల గురించి అమెరికాకు ఇజ్రాయెల్ ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ ఇంత భారీ స్థాయిలో ఉంటాయని వారు ఊహించలేదని తెలిపింది. అమెరికా సీనియర్ అధికారి ఒకరు ఇజ్రాయెల్ వైఖరిపై ‘WTF’ (తీవ్ర అసహనం) అంటూ స్పందించినట్లు తెలుస్తోంది. చమురు కేంద్రాలను టార్గెట్ చేసుకోవడమనే ఆలోచన మంచిది కాదని వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఫిబ్రవరి 28 యుద్ధం మొదలైన తర్వాత ఇజ్రాయెల్ తీరుపై అమెరికా ఈస్థాయిలో అసహనం వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి. ఇరాన్ చమురు నిల్వ కేంద్రాలపై ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది గాయపడ్డారు.
ఈ దాడుల విషయంలో అధ్యక్షుడు సంతోషంగా లేరని ట్రంప్ సలహాదారులు వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ వైఖరి అధినేతను తీవ్ర ఆగ్రహానికి గురిచేసిందని చెప్పారు. ‘ఈ స్థాయి దాడులు అధ్యక్షుడికి నచ్చలేదు. ఆయన చమురు వనరులను కాపాడాలని అనుకుంటున్నారు. నాశనం చేయాలని కాదు.. ఇటువంటి చర్యలు చమురు ధరలు పెరుగుదలకు కారణమవుతాయి’ అని ట్రంప్ సలహాదారు ఒకరు వ్యాఖ్యానించారు.
చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్లోని సామాన్యులు ఇబ్బందులకు గురవుతారని వైట్హౌస్ అధికారి అభిప్రాయపడ్డారు. ఇది వ్యూహాత్మకంగా ‘సరైన ఆలోచన కాదు’ కాదని.. దీనివల్ల ఇరాన్ పౌరులు తమపై వ్యతిరేకత పెంచుకునే ప్రమాదం ఉంది’ అని అమెరికా అధ్యక్ష భవనం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అమెరికా నుంచి 'WTF' సందేశం వచ్చినట్టు ఇజ్రాయెల్ అధికారులు పేర్కొన్నారు. కానీ,. అటు వైట్హౌస్ ఇటు ఇజ్రాయెల్ డిఫెన్ష్ ఫోర్సెస్ దీనిపై ఇప్పటి వరకూ స్పందించలేదు.
ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని మూడు ఆయిల్ డిపోలు, రిఫైనరీలపై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడింది. ఈ దాడి అనంతరం అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, భీతావాహ పరిస్థితులు నెలకున్నాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక డిపో నుంచి ఇంధనం లీక్ అవుతుండగా మంటలు చెలరేగాయి. వీధుల గుండా అగ్ని కీలలు ప్రవహించి, దట్టమైన పొగలు వ్యాపించి, ‘ఆమ్ల వర్షం’ కురిసిందనే నివేదికలతో ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు చేశారు.
ఇజ్రాయెల్ దాడులలో మానవతా, పర్యావరణ నష్టం ఒక అంశం మాత్రమే.. ఇది యుద్ధంలో భయంకరమైన తీవ్రతను సూచిస్తుందని సైనిక పరిశీలకులు తెలిపారు. ప్రపంచంలోనే అత్యధికంగా చమురు వనరులు కలిగిన దేశాల్లో ఇరాన్ ఒకటి. కానీ, ఆ దేశ ఆయిల్ నిల్వ కేంద్రాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోవడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మరింత పెరిగే ప్రమాదముందని అగ్రరాజ్యం ఆందోళన చెందుతోంది. యుద్ధం పదో రోజుకు చేరుకోగా.. చమురు ధరలు ఈ పది రోజుల్లోనే దాదాపు 17 శాతం మేర పెరిగి.. బ్యారెల్ 100 డాలర్లు దాటింది. నాలుగేళ్లలో క్రూడాయిల్ 100 డాలర్లు దాటడం ఇదే మొదటిసారి. ఇలాంటి తరుణంలో ఇరాన్పై దాడితో ధరలు మరింత పెరిగితే దాని పర్యవసానాలు, విమర్శలను ఇజ్రాయెల్తో పాటు తాము మోయాల్సి వస్తుందని అమెరికా ఆందోళన చెందుతుంది.
Latest News