|
|
by Suryaa Desk | Sun, Mar 08, 2026, 09:04 PM
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసక ఇన్నింగ్స్తో చెలరేగిపోయాడు. న్యూజిలాండ్ బౌలర్లపై ఆకాశమే హద్దుగా విరుచుకుపడి పరుగుల సునామీ సృష్టించాడు. కేవలం 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సహాయంతో 52 పరుగులు చేసి, ఫైనల్ పోరులో భారత్కు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. అతని సుడిగాలి ఇన్నింగ్స్తో నరేంద్ర మోదీ స్టేడియం దద్దరిల్లిపోయింది.ఈ మెగా ఫైనల్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే అతని నిర్ణయం పూర్తిగా తలకిందులైంది. క్రీజులోకి వచ్చిన తొలి బంతి నుంచే అభిషేక్ శర్మ తన ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు. కివీస్ పేసర్లు మాట్ హెన్రీ, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్లను లక్ష్యంగా చేసుకుని బౌండరీల వర్షం కురిపించాడు. మరో ఓపెనర్ సంజూ శాంసన్ కూడా దూకుడుగా ఆడటంతో పవర్ప్లే ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. ముఖ్యంగా ఫెర్గూసన్ వేసిన రెండు ఓవర్లలోనే 48 పరుగులు రాబట్టారంటే భారత బ్యాటర్ల ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ తొలి వికెట్కు కేవలం 7.1 ఓవర్లలోనే 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే అభిషేక్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రచిన్ రవీంద్ర బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి అభిషేక్ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ కూడా అదే జోరును కొనసాగించాడు. మరోవైపు సంజూ శాంసన్ (37 బంతుల్లో 67 నాటౌట్) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో ఇన్నింగ్స్ను నడిపించగా, ఇషాన్ కిషన్ (14 బంతుల్లో 34 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో 12 ఓవర్లు ముగిసేసరికి భారత్ కేవలం ఒక వికెట్ నష్టానికి 161 పరుగుల భారీ స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. అభిషేక్ శర్మ వేసిన బలమైన పునాదిపై మిగతా బ్యాటర్లు భారీ స్కోరు దిశగా దూసుకెళ్తున్నారు.
.
Latest News